Begin typing your search above and press return to search.

గుణశేఖర్ ను వాళ్లు చాలా ఇబ్బంది పెట్టారట!

By:  Tupaki Desk   |   30 Jun 2022 12:30 AM GMT
గుణశేఖర్ ను వాళ్లు చాలా ఇబ్బంది పెట్టారట!
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో గుణశేఖర్ ఒకరు. ఆయన ఆలోచనా విధానం .. తెరపై ఆయన ఒక కథను ఆవిష్కరించే తీరు కొత్తగా ఉంటాయి. పౌరాణిక చిత్రాలనే కాదు .. చారిత్రక చిత్రాలను కూడా అద్భుతంగా మలచగలనని ఆయన నిరూపించుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చెప్పుకోదగిన సినిమాలలో 'రుద్రమదేవి' ఒకటి. ఈ సినిమాకి ఆయన దర్శకనిర్మాతగా వ్యవహరించారు. ఆర్ధికపరమైన ఇబ్బందులను సైతం ఎదుర్కుంటూ ఆయన ఈ సినిమాను విడుదల చేశారు. అనుష్క ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'రుద్రమదేవి'గా అనుష్కను ఆయన చూపించిన తీరుకు ప్రశంసలు లభించాయి. సొంత నిర్మాణంలో ఆయన చేసిన సాహసాన్ని అభినందించారు. ఇక ఆర్ధికంగా కూడా ఈ సినిమా ఆయన ఇబ్బందులను గట్టెక్కించింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు మాత్రం గుణశేఖర్ చాలా టెన్షన్ పడ్డారని తెలుస్తోంది.

ముంబైకి చెందిన ఒక గ్రాఫిక్స్ సంస్థ ఆయనను కాస్త ఇబ్బంది పెట్టినట్టుగా కొండా సురేఖ మాటలను బట్టి తెలుస్తోంది. ఇటీవలే 'కొండా' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఆమె గుణశేఖర్ గురించి ప్రస్తావించారు.

"గుణశేఖర్ గొప్ప దర్శకుడు .. ఆయన తీసే సినిమాల గురించి కూడా మాకు తెలుసు. అలాంటి గుణశేఖర్ 'రుద్రమదేవి' సినిమా చేసేటప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వలన ముంబైకి చెందిన ఒక సంస్థకి ఆ బాధ్యతను అప్పగించారు.

అందు కోసం తన సినిమా కంటెంట్ ను వాళ్లకి అందజేశారు. అయితే ఆ సంస్థవారు గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేయరు .. గుణశేఖర్ గారికి ఆ కంటెంట్ ఇవ్వరు. అలా ఆయనను వాళ్లు ఆఫీసు చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారు.

మమ్మల్ని కలిసిన గుణశేఖర్ తను పడుతున్న అవస్థను గురించి చెప్పుకొచ్చారు. దాంతో కొండా నేరుగా ముంబై వెళ్లి .. ఆ సంస్థవారికి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో వారం తిరిగేసరికి ఆ సంస్థ వారు గుణశేఖర్ కి కంటెంట్ ను అప్పగించారు. అప్పుడు ఆయన కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి గుణ శేఖర్ ఫ్యామిలీకి .. మాకు మధ్య ఒక అనుబంధం ఏర్పడింది" అంటూ చెప్పుకొచ్చారు. ఇక గుణశేఖర్ తాజా చిత్రంగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శాకుంతలం' రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.