Begin typing your search above and press return to search.

ఇకపై రీమేకులు చేయను: కియారా అద్వాని

By:  Tupaki Desk   |   7 May 2022 2:30 AM GMT
ఇకపై రీమేకులు చేయను: కియారా అద్వాని
X
బాలీవుడ్లో భారీ పారితోషికం అందుకుంటున్న భామలలో కియారా ఒకరు. అందానికి అందం .. అప్పుడే తీసిన గంధంలా ఈ ముద్దుగుమ్మ కనిపిస్తుంది. బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' సినిమా చేసిన తరువాత ఈ బ్యూటీ దశ తిరిగిపోయింది. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా మరింత కుదురుకుని ఒక రేంజ్ లో చక్రం తిప్పేస్తోంది. ఇప్పడు బాలీవుడ్లో అత్యంత కష్టతరమైన పనుల్లో, ఈ సుందరి డేట్లు సంపాదించడం కూడా ఒకటిగా చేరిపోయింది. అంతగా కియారా తన డిమాండ్ ను .. మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతోంది.

నిన్నమొన్నటి వరకూ కరీనా .. కత్రినా ఫొటోలను డీపీలుగా పెట్టుకున్న కుర్రాళ్లు ఇప్పుడు ఆ ప్లేస్ లో కియారా డీపీలను పెట్టేశారు. అంతగా ఆమె వాళ్లందరి మనసులను దోచేసింది. హృదయాలను హోల్ సేల్ గా కొల్లగొట్టేసింది. ఇక ఏ మాత్రం కాస్త వీలు దొరికినా తెలుగులోని స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆమె ఉత్సాహం చూపుతోంది. 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కియారా, ఆ తరువాత 'వినయ విధేయ రామా' సినిమా కూడా చేసింది. ఇక శంకర్ సినిమాలో చరణ్ సరసన రెండోసారి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది.

తెలుగులో వచ్చిన 'అర్జున్ రెడ్డి'ని హిందీలో రీమేక్ చేయగా కియారా నటించింది. ఆ సినిమాకి ఆమె కెరియర్ కి చాలా హెల్ప్ అయింది. అయినా ఇకపై రీమేకులు చేయను అని కియారా చెబుతోంది. "సౌత్ సినిమాలు బాలీవుడ్ సినిమాలను డామినేట్ చేస్తున్నాయి గనుక, సౌత్ సినిమాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్ వారు ఇష్టపడటం లేదనే ప్రచారంలో నిజం లేదు. మంచి కంటెంట్ ఉంటే భాషతో పనిలేకుండా బాలీవుడ్ లో రీమేక్ అవుతూనే ఉంటాయి.

ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే అందరూ కూడా ఓటీటీలో చూసేస్తున్నారు. అందువలన రీమేకులు చేయడానికి నేను పెద్దగా ఇష్టపడటం లేదు. ఆల్రెడీ అందరికీ రీచ్ అయిన కంటెంట్ చేయడానికి ఆసక్తి ఉండకపోవడం సహజమే కదా. అందువలన నేను రీమేకులు చేయడానికి ఉత్సాహం చూపడం లేదు. ఒకవేళ కథలో మార్పులు .. చేర్పులు చేసి ఒక కొత్త కథగా చెప్పాలనుకుంటే మాత్రం చేస్తాను. ఇక ఇతర భాషల్లో నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధగానే ఉంటాను. కాకపోతే హిందీలో చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతాం గనుక ఆ వైపు మొగ్గుచూపడం జరుగుతుంది" అని చెప్పుకొచ్చింది.