Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఆత్మ వాళ్లకే ఎందుకు కనిపిస్తోందో

By:  Tupaki Desk   |   10 Nov 2017 11:30 PM GMT
ఎన్టీఆర్ ఆత్మ వాళ్లకే ఎందుకు కనిపిస్తోందో
X
ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అంటే దిగ్గజ నటుడు ఎన్టీ రామారావే. ఆయన జీవితంపై ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు సినిమాలను ప్రకటించేశారు. ఇలా ఎన్టీఆర్ పై సినిమా తీసేందుకు ఎవరి రీజన్స్ వారికి ఉన్నాయి. ఎవరి యాంగిల్ వారికి ఉంది. ఇక్కడ ఆత్మలు కూడా ఎంటర్ అయిపోవడమే విచిత్రంగా ఉంది. ఆత్మలున్నాయా లేదా అంటే సమాధానం చెప్పలేం కానీ.. ఈ మూవీ మేకర్స్ కు మాత్రం మరీ క్రియేటివిటీ ఎక్కువయిపోతోంది.

బాలకృష్ణ అంటే.. ఎన్టీఆర్ కుమారుడు కాబట్టి.. తన తండ్రి జీవితంలోని అద్భుత ఘట్టాలను.. ఆయన కష్టపడి పైకొచ్చిన విధానాన్ని సినిమా తీస్తానన్నారు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ.. రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నట్లు చెప్పాడు. ఈ సినిమాను తనను ప్రేరేపించినది.. ఈ మూవీకి కథ అందిస్తున్నది.. ఎన్టీఆర్ ఆత్మే అని వర్మ ఉవాచ. ఎన్టీఆర్ ఆత్మ తనకు కనిపిస్తోందని.. వినిపిస్తోందని.. చెప్పేస్తున్నాడు వర్మ. ఇక లక్ష్మీస్ వీరగ్రంధం తీస్తానని చెప్పిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డికి కూడా ఎన్టీఆర్ ఆత్మ కనిపించేసింది.. ఈ సినిమా తీయమని ప్రోత్సహించింది.

అంతవరకూ బాగానే ఉంది కానీ.. పాపం బాలకృష్ణకు మాత్రం ఎన్టీఆర్ ఆత్మ కనిపించడం లేదు. అందుకే ఎన్టీఆర్ సన్నిహితులను సంప్రదించి మరీ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయించుకున్నారు. ఇంతకీ తన కుటుంబంలో ఎవరికీ కనిపించని ఎన్టీఆర్ ఆత్మ.. వర్మకు.. కేతిరెడ్డికి మాత్రం ఎందుకు కనిపిస్తోందన్న ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పగలరో!