Begin typing your search above and press return to search.

కౌశల్ ఆర్మీ టార్గెట్ ఇప్పుడు వీరిద్దరే..

By:  Tupaki Desk   |   7 Aug 2018 10:45 AM GMT
కౌశల్ ఆర్మీ టార్గెట్ ఇప్పుడు వీరిద్దరే..
X
బిగ్ బాస్ లో ఈ వారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎప్పటినుంచో కౌశల్ ఆర్మీ ఎదురుచూస్తున్న సందర్భం ఈ వారం వచ్చేసింది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయినే నడుస్తోంది. కౌశల్ ఆర్మీ తాజా టార్గెట్ తనీష్ - బాబు గోగినేనిలు.. వీరిద్దరూ కౌశల్ ను హౌస్ లో ఎలా ముప్పుతిప్పలు పెడుతూ విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే.. ఇన్నాళ్లు అయితే బాబు లేదంటే తనీష్ మాత్రమే నామినేషన్ లోకి వచ్చారు.కానీ ఈ వారం ఇద్దరూ ఎలిమినేషన్ కు నామినేట్ కావడంతో కౌశల్ ఆర్మీ సమాయత్తమైంది. బలమైన ఈ ఇద్దరిలోంచి ఒకరిని ఇంటికి పంపించేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఇతర కంటెస్టెంట్లకు భారీగా ఓట్లు వేస్తున్నట్టు సమాచారం.

ఈ సోమవారం బిగ్ బాస్ ఆసక్తికర టాస్క్ ఇచ్చాడు. బయట గార్డెన్ ఏరియాలో ఓ టెంట్ ను ఏర్పాటు చేసి ఇంటిసభ్యులందరూ ఎవరైతే ముందుగా అందులోకి వెళతారో వారంతా సేఫ్ అని.. చివర్లో వెళ్లిన వారు ఎలిమినేట్ అవుతారని పేర్కొన్నాడు. ఈ టాస్క్ లో పెద్దాయన బాబు గోగినేని హౌస్ లోకి వెళ్లలేక ఓడిపోయాడు. ఇక తనీష్ మరోసారి తనకు ఎంతో ఇష్టమైన దీప్తి సునయనను ఎలిమినేట్ కాకుండా కాపాడేందుకు ఆమెను టెంట్ లోకి పంపించి తను కావాలనే ఓడిపోయి నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇక ఈ టాస్క్ లో గీతామాధురి - శ్యామల - గణేష్ - దీప్తి నల్లమోతు కూడా టెంట్ లోకి ముందుగా వెళ్లడంలో విఫలమై నామినేషన్ లోకి వచ్చారు.

ఇంటిసభ్యులందరిలో బలమైన తనీష్ - బాబు గోగినేనిలు ఒకేసారి నామినేషన్స్ లోకి రావడంతో కౌశల్ ఆర్మీ ఎలాగైనా సరే వీరిలో ఒకరిని బయటకు పంపించేందుకు దృష్టి పెట్టింది. మిగిలిన నలుగురికి ఓట్లు పంచి వీరిని టార్గెట్ చేసింది. అయితే కౌశల్ కు వ్యతిరేక వర్గం మాత్రం బాబు - తనీష్ ఇద్దరినీ కాపాడుకోవడానికి క్యాంపెయిన్ చేస్తోంది. ఇద్దరికీ సమానంగా ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నారు. చూడాలి మరి ఈ శనివారం కౌశల్ ఆర్మీ పంతం నెగ్గుతుంతా.. బాబు - తనీష్ గ్రూప్ ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా.?