Begin typing your search above and press return to search.

కశ్మీర్ ఫైల్స్ అయిపోయింది.. ఇక 'ఢిల్లీ ఫైల్స్'మొదలు

By:  Tupaki Desk   |   17 April 2022 10:30 AM GMT
కశ్మీర్ ఫైల్స్ అయిపోయింది.. ఇక ఢిల్లీ ఫైల్స్మొదలు
X
వివాదాస్పద అంశాలను కథలుగా మలిచి దేశాన్ని షేక్ చేస్తున్న దర్శకుడు 'వివేక్ అగ్నిహోత్రి'. ఇటీవల ఆయన దర్శకత్వంలో సైలెంట్ గా వచ్చిన 'కశ్మీర్ ఫైల్స్'చిత్రం దేశాన్ని కుదుపు కుదిపింది. చిన్న బడ్జెట్ తో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వందల కోట్లు కొల్లగొట్టింది. కశ్మీర్ లో పండింట్ల ఊచకోతను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని విడుదల చేసిన చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ఓ వర్గం వారు వ్యతిరేకించినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు దీన్ని ఓన్ చేసుకొని మరీ ముందుకు నడిపించారు.

కశ్మీర్ ఫైల్స్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి తన తదుపరి చిత్రంపై ప్రకటన చేశాడు. 'ద ఢిల్లీ ఫైల్స్' పేరుతో కొత్త సినిమా తెరకెక్కించబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా శుక్రవారం ప్రకటించారు.

ద కశ్మీర్ ఫైల్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ సినిమా అనేక చర్చలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో వివేక్ తదుపరి చిత్రంపై అంచనాలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు మరో వివాదాస్పద అంశాన్ని తీసుకొని మరోసారి దేశ రాజకీయాలను షేక్ చేసేలా వివేక్ కనిపిస్తున్నాడు.

ద ఢిల్లీ ఫైల్స్ అని టైటిల్ ప్రకటించిన వివేక్.. 2020 ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలోనే సినిమా తీయబోతున్నట్టు తెలుస్తోంది. 2019లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరి-మార్చిలో హిందువులు, ముస్లింల మధ్య ఢిల్లీలో జరిగిన ఘర్షణలపైనే సినిమా తీస్తున్నారని చర్చ జరుగుతోంది.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, అనుకూలంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసలు దారుణాలు వెలుగుచూశాయి. చంపేసి మురికి కాలువల్లో శవాలను పడేసిన తీరు అందరినీ కంటతడిపెట్టిస్తోంది. అంతేకాదు.. అంకిత్ శర్మ అనే ఐబీ ఆఫీసర్ ను ఏకంగా ఆరుగంటల పాటు శరీరంలోని అన్ని అవయవాలపై 400 కత్తిపోట్లు పొడిచి పేగులు బయటకు తీసి నరకం చూపించి చంపారని వైద్యుల పోస్టుమార్టంలో తేలడం ఈ హింస ఎంత దారుణంగా జరిగిందో ఊహించడానికే భయం వేస్తోంది. ఈ పరస్పర దాడుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. 38మంది చనిపోగా వందలాది మంది గల్లంతయ్యారు.చాలా మంది మృతదేహాలు మురికికాలువల్లో దొరికాయి. ఇక తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఘర్షణలు కాస్తా తగ్గుముఖం పట్టినా ఆ దారుణాలు మాత్రం ఇప్పటికీ బాధితుల కన్నీళ్ల తుడుచలేకపోయాయి.

చనిపోయిన బాధితులకు ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, ఇల్లు, దుకాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులకు రూ.10లక్షలు ఇస్తామని కేజ్రీవాల్ తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పునరావాసం, రోడ్లు, ఆలయాలు, మసీదులను మరమ్మతు చేస్తున్నారు.