Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ కు మాఫియా బెదిరింపులు?

By:  Tupaki Desk   |   9 March 2016 7:23 AM GMT
ఆ హీరోయిన్ కు మాఫియా బెదిరింపులు?
X
భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్‌ తనకు మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారం సుప్రీం కోర్టులో హాజరైన ఆమె... ఈ బెదిరింపుల నేపథ్యంలో తన విడాకుల కేసు విచారణను ముంబయి నుంచి దిల్లీకి మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను కోరింది. జస్టిస్‌ ఏకే సిక్రి - జస్టిస్‌ ఆర్‌కే అగర్వాల్‌ లతో కూడిన ధర్మాసనం ఆమె పిటిషన్‌ ను విచారించింది.

భర్త సంజయ్ కపూర్ - అత్త తనను మానసికంగా వేధిస్తున్నారంటూ కరిష్మా ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతకుముందు నుంచే సంజయ్ - కరిష్మాలు వేర్వేరుగా ఉంటున్నారు. అనంతరం ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ విడాకుల కేసు ప్రస్తుతం ముంబయిలోని బాంద్రా కుటుంబ న్యాయస్థానంలో ఉంది. మరోవైపు, కరిష్మాకు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం తెలియదని, డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకుందని సంజయ్ కపూర్ ఆరోపిస్తున్నాడు. తన పిల్లలను అడ్డం పెట్టుకొని డబ్బు కావాలని అడుగుతోందన్నారు. పిల్లలను తనకు అప్పగించాలంటూ సంజయ్ పిటిషన్ వేశాడు.

కాగా 2003లో పెళ్లి చేసుకున్న కరిష్మా - సంజయ్ కపూర్‌ లు గతంలోనూ విడాకుల వరకు వెళ్లినా ఆగిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు. సుమారు ఏడేళ్లు కాపురం చేసిన కరిష్మా - సంజయ్ లు 2010 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. అప్పటి నుంచి కరిష్మా ముంబైలోని తన పుట్టింట్లో ఉంటుంది. తర్వాత విడాకుల కోసం కోర్టు కెక్కారు. ఇద్దరి మధ్య కొన్ని విషాయాలు పరిష్కారం కాక పోవడంతో విడాకుల ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. గతంలో పలు వాయిదాల్లో వారిరువురు ఒక ఒప్పందానికి రాకపోవడంతో మళ్లీ కేసు వాయిదా మీద వాయిదా పడింది. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరూ ఒప్పందానికి రాకపోతే పిటీషన్‌ను ఉపసంహరించుకోవాల్సి ఉంటుందన్న నిబంధనతో గతేడాది కరిష్మా విడాకుల పిటీషన్ ఉపసంహరించుకుంది.

తాజా పరిణామాలతో ఈసారి ఇద్దరి మధ్య విడాకులు తప్పవని తెలుస్తోంది. ఆరేళ్లుగా కాపురం చేయని వీరిద్దరూ ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.