Begin typing your search above and press return to search.

వాటర్‌ క్యాన్స్‌ వేసిన అతడు ఇప్పుడు రూ.350 కోట్ల స్టార్‌

By:  Tupaki Desk   |   7 Nov 2022 2:30 AM GMT
వాటర్‌ క్యాన్స్‌ వేసిన అతడు ఇప్పుడు రూ.350 కోట్ల స్టార్‌
X
కన్నడ సినిమా పరిశ్రమలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కాంతార సినిమా గురించి ప్రముఖంగా చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. రిషబ్‌ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూలు దక్కించుకున్న రెండో సినిమా గా ఈ సినిమా నిలిచింది. కే జి ఎఫ్ 2 తర్వాత ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసిన సినిమాగా కన్నడ సినీ చరిత్రలో సరి కొత్త రికార్డు నమోదు చేయడం తో ఈ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది.

సినిమా లోని పలు సన్నివేశాలు భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయంటూ రిషబ్‌ దర్శకత్వ ప్రతిభ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఈ సినిమా కు దర్శకత్వం వహించి నటుడి గా నటించి మంచి గుర్తింపును దేశవ్యాప్తంగా దక్కించుకున్న రిషబ్ శెట్టి గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న సవాళ్లు కష్టాలను గురించి చెప్పుకొచ్చాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో నటించడం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టానని అప్పటి నుండి చాలా కష్టాలు ఎదుర్కొన్నానని అన్నాడు.

దాదాపు పది సంవత్సరాల పాటు చాలా ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చానని అన్నాడు. ఒకానొక సమయంలో ఇంట్లో డబ్బులు అడగలేక హోటల్స్ లో పని చేయడం వాటర్ క్యాన్స్‌ వేయడం రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పని చేయడం ఇలా ఎన్నో పనులు చేసి పూట గడిపే వాన్ని అంటూ రిషబ్‌ శెట్టి చెప్పుకొచ్చాడు.

10 సంవత్సరాల కష్టానికి ఫలితం ఇప్పుడు దక్కుతుంది అన్నట్లుగా అతడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇండస్ట్రీలో కష్టపడితే తప్పకుండా ఫలితం దక్కుతుందని రిషబ్ ని చూస్తే అర్థమవుతుంది. ఆయన ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.