Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న కన్నడ హీరోలు..!

By:  Tupaki Desk   |   28 July 2022 7:30 AM GMT
టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న కన్నడ హీరోలు..!
X
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియన్ సినిమాపై డామినేషన్ చూపిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రాలు నిర్మిస్తూ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మన హీరోలు సైతం తమ చిత్రాలను ఇతర భాషల్లో రిలీజ్ చేసి మార్కెట్ విస్తరించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

నిజానికి మొదట్నుంచీ మన హీరోలకు పరభాషా చిత్రాల మీద మోజు తక్కువగా ఉండేది. మిగిలిన దక్షిణాది ఇండస్ట్రీలతో పోల్చితే మార్కెట్ పరంగా అవి చిన్నవి కావడం వల్లనో ఏమో.. అక్కడ జెండాపాతాలని అనుకోలేదు. ఒకరిద్దరు హీరోలు ప్రయత్నాలు చేసారు కానీ.. అంతగా వర్కౌట్ కాలేదు.

అదే సమయంలో ఇతర దక్షిణాది పరిశ్రమలకు చెందిన హీరోలు మొదట్నుంచీ తెలుగులో సత్తా చాటడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తమిళ మలయాళ హీరోలు టాలీవుడ్ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కమల్ హాసన్ - రజినీ కాంత్.. మమ్ముట్టి - మోహన్ లాల్ - సురేష్ గోపీ మొదలుకొని.. ఇప్పటి యువ హీరోల వరకూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలతోనే కాకుండా స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు.

అయితే కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు మాత్రం పెద్దగా టాలీవుడ్ పై దృష్టి పెట్టలేదనిపిస్తుంది. విష్ణు వర్ధన్ - అర్జున్ సర్జా - ఉపేంద్ర లాంటి ఇద్దరు ముగ్గురు హీరోలు తప్ప ఎవరూ అంతగా తెలుగులో తమ చిత్రాలను రిలీజ్ చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. శాండిల్ వుడ్ హీరోలంతా ఇప్పుడు మన మార్కెట్ పై దృష్టిసారిస్తున్నారు.

'కేజీఎఫ్' తర్వాత కన్నడ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఇప్పుడు అక్కడ నుంచి కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ప్రతీ హీరో కూడా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి.. టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

'ఈగ' సినిమాతో విలన్ గా తెలుగు వారికి పరిచయమైన కన్నడ హీరో కిచ్చా సుదీప్.. 'రక్త చరిత్ర' 'బాహుబలి' చిత్రాలలో కనిపించాడు. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలన్నింటినీ ఇక్కడ కూడా రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 'విక్రాంత్ రోణ' వంటి భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

అక్కినేని నాగార్జున - అఖిల్ - రాజమౌళి - రామ్ గోపాల్ వర్మ వంటి టాలీవుడ్ ప్రముఖులు 'విక్రాంత్ రోణ' సినిమాకు తనవంతు సపోర్ట్ ఇచ్చారు. రేపు శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

'కేజీఎఫ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యష్.. 'కేజీఎఫ్ 2' తో టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ లో వసూళ్ళు కొల్లగొట్టాడు. ఇక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఇక పై యష్ నుంచి రాబోయే సినిమాలన్నీ తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

'అతడే శ్రీమన్నారాయణ' అంటూ వచ్చిన కన్నడ హీరో రక్షిత్ శెట్టి.. ఇటీవల '777 ఛార్లీ' చిత్రంతో తెలుగువారికి దగ్గరయ్యాడు. అర్జున్ సర్జా మేనల్లుడు ద్రువ సర్జా కూడా ఆ మధ్య 'పొగరు' అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించాడు.

ఇలా పలువురు కన్నడ హీరోలు ఇప్పుడు తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టారు. తమ మాతృభాషలోనే కాకుండా ఇక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు భాష గురించి పట్టించుకోకుండా నటీనటులను ఆదరిస్తుంటారు. అందుకే ఇతర భాషల హీరోలు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. మన హీరోలకు కూడా ఇతర దక్షిణాది ఇండస్ట్రీల్లో ఇదే మాదిరిగా ఆదరణ దక్కితే మంచిదే.