Begin typing your search above and press return to search.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కనికాకు ఇప్పటికి బుద్ధి రాలేదా?

By:  Tupaki Desk   |   22 March 2020 7:10 AM GMT
ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్న కనికాకు ఇప్పటికి బుద్ధి రాలేదా?
X
కేవలం తన నిర్లక్ష్యం.. అలక్ష్యం.. తెలివిలేనితనం.. విషయాల తీవ్రత తెలిని వ్యవహారశైలితో ఇప్పటికే దేశ ప్రజలందరి ఆగ్రహానికి గురి అవుతున్న సింగర్ కనికా కపూర్.. కరోనా పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా తన తీరును మార్చుకోలేదా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారు పద్నాలుగు రోజుల పాటు స్వీయ నిర్బందంలో ఉండాలన్న సూచనను పాటించకపోవగా.. ఒక పార్టీకి హాజరైన కారణంగా.. ప్రముఖులు పలువురి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు. ఆమె పార్టీలో పాల్గొన్న తర్వాత ఆమె కరోనా వైరస్ బారిన పడిన వైనం బయటకు రావటం తెలిసిందే.

దీంతో.. ఆమె పుణ్యమా అని.. రాజ్యసభ వరకూ కరోనా వైరస్ ప్రయాణం చేసే ప్రమాదానికి కారణమయ్యారు. సెలబ్రిటీగా ఉన్న ఆమె బాధ్యతను మరిచి వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె చికిత్స పొందుతున్న మెడికల్ డైరెక్టర్ ఆమెపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఆమె లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఐసోలేషన్ గదిలో చికిత్స పొందుతున్నారు.

ఆసుపత్రిలో ఆమె స్టార్ లా కాకుండా రోగిలా ప్రవర్తించాలని సదరు సంస్థ డైరెక్టర్ కోరుతున్నారు. కనికాకు ప్రత్యేకమైన ఐసోలేషన్ గదిలో ఉంచి.. అటాచ్ టాయ్ లెట్.. టీవీ.. వెంటిలేటర్ సౌకర్యాలు కల్పించినట్లు చెబుతున్నారు. తాముఅన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత కూడా ఆమె.. స్టార్ లా కాకుండా రోగిలా వ్యవహరించాలన్న మాట చూస్తే.. చికిత్స చేసే వైద్యులకు ఎంతటి చుక్కలు చూపిస్తుందో అర్థమవుతుంది. ఇప్పటికే ఆమె చేసిన ఎదవ పనిని పలువురు విమర్శిస్తున్న వేళ.. ఆమె మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.