Begin typing your search above and press return to search.

జాలి ప్రేమ స్నేహం క‌నిక‌రం లేని దారుణ‌ ఇండ‌స్ట్రీ ఇది!

By:  Tupaki Desk   |   7 Sep 2021 4:30 AM GMT
జాలి ప్రేమ స్నేహం క‌నిక‌రం లేని దారుణ‌ ఇండ‌స్ట్రీ ఇది!
X
వివాదాల క్వీన్ కంగనా రనౌత్ బాలీవుడ్ పై మరోసారి తీవ్ర‌ విమర్శలు చేసింది. ప్రేమ కరుణ భావన లేని ఏకైక‌ ప్రదేశం అంటూ బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌పై తీవ్ర నింద‌లు మోపారు కంగ‌న‌. ప్ర‌ముఖ యూట్యూబ్ చానెల్ తో మాట్లాడుతూ.. రిలీజ్ కి సిద్ధ‌మైన‌ జయలలిత బయోపిక్ `తలైవి`ని ప్రమోట్ చేస్తున్న కంగనా.. ఉత్త‌రాది పరిశ్రమ `విషపూరితమైన ప్రదేశం` అని వ్యాఖ్యానించ‌డం దుమారం రేపుతోంది.

ప్రాంతీయ చిత్ర పరిశ్రమలతో పోలిక చెబుతూ.. కంగనా రనౌత్ ఫిరంగులు విసిరారు. కంగ‌న మాట్లాడుతూ.. ప్రాంతీయ సినిమా గురించి చాలా అద్భుతమైన విషయం ఏమిటంటే.. వారు కనీసం కొన్ని సాధారణ కారణాలను కనుగొంటారు. వారు ఊసరవెల్లిలా ఉండ‌రు. హిందీ చిత్రాలలో న‌టించాల‌ని మనమంతా ముంబైకి వలస వస్తాం కాబ‌ట్టి అక్కడ చాలా వైవిధ్యం ఉంది. ఇంకా కొంత ఉద్రిక్తత ఉంటుంది ... ప్రతిఒక్కరూ అందరినీ కిందకు లాగాలనుకుంటున్నారు. ఈ ప‌రిశ్ర‌మ‌ అస్సలు సహాయం చేయదు. ఇది ఒక విషపూరితమైన ప్రదేశంగా మారింది. ఏదో ఒకవిధంగా మరొక వ్యక్తి బావుంటే ఎవరూ చూస్తూ సంతోషంగా లేరు. మనల్ని గుర్తించగలిగే వారిని స‌రైన వేదిక‌ను ఇక్క‌డ మ‌నం ఎప్ప‌టికీ కనుగొనలేము`` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

బాలీవుడ్ లో విషాన్ని పెంచి పోషించే వాతావరణాన్ని కలిగి ఉందని ఎందుకు అనుకుంటుందనే దానికి మరిన్ని కారణాలను చెప్పింది. ``ప్రేమ లేని.. సానుభూతి లేని.. స్నేహభావం లేని.. కనికరం లేని ప్రదేశమిది. అలాంటి ప్రదేశం ఎంత విషపూరితం అవుతుందో మీరు ఊహించవచ్చు`` అని కంగనా ముగించింది. కంగ‌న `తలైవి` త‌దుప‌రి ధాకాడ్- తేజస్ - ఎమర్జెన్సీ లాంటి భారీ యాక్ష‌న్ చిత్రాల్లో న‌టిస్తోంది.

కంగ‌న‌కు అవార్డులు ఖాయం..!

నాటి మేటి అగ్ర క‌థానాయిక‌.. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న `తలైవి` రిలీజ్ కి రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. తలైవి సినిమాను తమిళ్- తెలుగు- హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. విబ్రి మీడియా- కర్మ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ విఠల్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు.

త‌లైవి లో కంగ‌న న‌ట‌న‌కు అవార్డులు రివార్డులు ద‌క్కుతాయ‌ని నిర్మాత‌లు అన్నారు. ఈ సినిమాతో కంగనా రనౌత్ కి ఐదో జాతీయ‌ అవార్డు వస్తుందని నమ్ముతున్నా. నేను నా జీవితంలో ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు.. ఈ సినిమా మరో ఎత్తు అని నా గట్టి నమ్మకం అని విష్ణు ఇందూరి అన్నారు. ``ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ రావాలని తలైవి టైటిల్ పెట్టాం. విజయేంద్ర ప్రసాద్ గారు ఈ ప్రాజెక్టులోకి రాగానే దాని స్వరూపమే మారోపోయింది. ఆయన ఎంటర్ కాగానే జయలలిత క్యారెక్టర్ కోసం కంగనాకు తీసుకుందామని చెప్పారు. కంగనాకు తగ్గట్టుగా ఎంజీఆర్ క్యారెక్టర్ అరవింద్ స్వామిని ఫైనల్ చేశామ‌``ని మేక‌ర్స్ అన్నారు. త‌లైవిలో కంగ‌న అభిన‌యం అద్భుతంగా ఉండ‌నుంద‌ని ఇంత‌కుముందు రిలీజైన ట్రైల‌ర్ తో అర్థ‌మైంది. కంగ‌న‌కు జాతీయ స్థాయి అవార్డులు ద‌క్కుతాయ‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు.