Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పై కైకాల మండిపాటు

By:  Tupaki Desk   |   8 Oct 2017 10:48 AM GMT
టాలీవుడ్ పై కైకాల మండిపాటు
X
తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరైన కైకాల సత్యనారాయణ.. అరుదుగా వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ఆయన్ని ఎవరు ఇంటర్వ్యూ చేసినా ప్రస్తుతం పరిశ్రమ వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి.. అసహనం వ్యక్తం చేస్తారు. ఆ మధ్య ‘బాహుబలి’ సినిమా గురించి తీవ్ర విమర్శలు గుప్పించి వార్తల్లో నిలిచారు పెద్దాయన. ఇప్పుడు ఇండస్ట్రీ మీద ఆయన మండిపడ్డారు. తమ కాలంలో సినిమాను ఒక కళగా భావించేవాళ్లమని.. ఎంతో తపనతో సినిమాలు చేసేవాళ్లమని.. కానీ ఇప్పుడు వ్యవహారాలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయని.. ఇండస్ట్రీ జనాలందరూ చాలా కమర్షియల్‌ గా మారిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఈ రోజుల్లో ఇండస్ట్రీ జనాలు కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నారు. మన సినిమాల బడ్జెట్లు.. ఆర్టిస్టుల పారితోషకాలు ఈ స్థాయిలో పెరిగిపోతాయని మేం ఎప్పుడూ ఊహించలేదు. అందరూ డబ్బు చుట్టూనే తిరుగుతుండటం వల్ల సినిమా ‘కళ’లో ఉన్న బలమేంటన్నది మరిచిపోతున్నారు’’ అని కైకాల అన్నారు. తాను ఏ ఒక్కరనో ఉద్దేశించి ఈ మాట అనట్లేదని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని సత్యనారాయణ అన్నారు. తెలుగు సినిమాకు ఎంతో సేవ చేసిన సీనియర్ నటులు.. టెక్నీషియన్లను ఈ తరం వాళ్లు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడినని.. ఎన్టీఆర్ తనను సోదరుడిలా చూసేవారని.. కానీ ఇప్పుడు తనను ఆ పార్టీ వాళ్లు మరిచిపోయారని ఆయన అన్నారు.