Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ బాగానే వున్నారు.. వీళ్ళకు ఏమైంది!

By:  Tupaki Desk   |   28 March 2021 4:33 AM GMT
పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ బాగానే వున్నారు.. వీళ్ళకు ఏమైంది!
X
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్‌ జరడానికి ఏ చిన్న కారణం దొరికినా చాలు. రెచ్చిపోతుంటారు అభిమానులు. ఇప్పుడు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య రగడకు కూడా ఒక చిన్న సంఘటన కారణంగా మారింది. తారక్ కెరీర్ ఆరంభంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి అతణ్ని పెద్ద స్టార్‌ను చేసిన ‘ఆది’ సినిమా విడుదలై 19 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శనివారం స్పెషల్ షో ఏర్పాటు చేసుకున్నారు అభిమానులు. ఈ షో గురించి వారం ముందు నుంచి హంగామా నడుస్తోంది. సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో ఈ షో కోసం పెట్టిన టికెట్లు కొన్ని గంటల్లోనే అయిపోయాయి కూడా. ఇక షో కోసం అభిమానులు ఏర్పాట్లు భారీగానే చేశారు. థియేటర్ దగ్గర బ్యాండ్ మేళం ఏర్పాటు చేసి.. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హంగామా చేశారు. ఐతే ఈ సందర్భంగా ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

బాణసంచా భారీ స్థాయిలో కాల్చడంతో గాల్లో చెలరేగిన మంటలకు ఆ థియేటర్ మీద కట్టిన వకీల్ సాబ్ ప్రమోషనల్ బెలూన్ పేలిపోయింది. ‘వకీల్ సాబ్’ సినిమాకు క్రాస్ రోడ్స్‌ లో మెయిన్ థియేటర్ సుదర్శనే కావడం తో రిలీజ్‌ కు రెండు వారాల ముందే అక్కడ పెద్ద బెలూన్ కట్టి ప్రమోషన్ మొదలుపెట్టారు. ఐతే ఎన్టీఆర్ అభిమానుల బాణసంచా కాల్పులతో అది కాస్తా పేలి పోయింది. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టేశారు. చూశారా మా అభిమానుల ధాటికి మీ హీరో బెలూన్ ఎలా పేలి పోయిందో అంటూ పవన్ అభిమానులను కవ్వించడం మొదలుపెట్టారు తారక్ ఫ్యాన్స్. అనుకోకుండా బెలూన్ పేలితే దాన్నో పెద్ద ఘనతగా చెబుతారేంటి అంటూ పవన్ ఫ్యాన్స్ వాళ్లపై ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో పరస్పరం తమ హీరోల గొప్పలు చెప్పుకోవడం, అవతలి హీరోను కించపరచడం చేస్తున్నారు ఇరు వర్గాల అభిమానులు. వీళ్లు పరస్పరం నెగెటివ్ హ్యాష్ ట్యాగ్‌లు కూడా పెట్టి ఒకరినొకరు ట్రోల్ చేస్తుండటం గమనార్హం.