Begin typing your search above and press return to search.

'తలైవి'ని ఐశ్వర్య చేసుంటే అమ్మ సంతోషించేది

By:  Tupaki Desk   |   12 Sep 2021 8:40 AM GMT
తలైవిని ఐశ్వర్య చేసుంటే అమ్మ సంతోషించేది
X
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి చెంది ఇన్నాళ్లు అయినా కూడా ఆమెపై అక్కడి జనాల్లో మాత్రం అభిమానం తగ్గలేదు. ఆమెను ఇంకా అమ్మ అంటూ పిలుచుకుంటూ ఆమె జ్ఞాపకాల్లో ఉన్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన తలైవి సినిమా విడుదల అయ్యింది. జయలలిత బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తలైవికి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. అమ్మ జీవితంలోని పలు విషయాలను చూపించే ప్రయత్నం చేశారంటూ అమ్మ అభిమానులు అంటున్నారు. అయితే కొన్ని సన్నివేశాల విషయంలో వ్యతిరేకత ఉన్నా కూడా మొత్తంగా అమ్మ జీవితంను చూపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. తమిళనాట అమ్మ బయోపిక్ కు మంచి రెస్పాన్స్ అయితే దక్కింది.

థియేటర్ల వద్ద కరోనా భయం లేకుండా జనాలు బాగానే ఉంటున్న నేపథ్యంలో తైలవి మేకర్స్ ప్రయత్నం సఫలం అయినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో గతంలో జయలలితను ఇంటర్వ్యూ చేసిన ఒక జర్నలిస్ట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా ఏళ్ల క్రితం అమ్మ ఒక ఇంటర్వ్యూలో తన బయోపిక్ కనుక చేస్తే దాన్ని ఐశ్వర్య రాయ్‌ చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. అప్పట్లో జయలలిత బాలీవుడ్‌ నెం.1 హీరోయిన్ గా ఉన్నారు. ఆమె అంటే అమ్మకు ప్రత్యేకమైన అభిమానం కూడా అవ్వడం వల్ల ఆమె తన బయోపిక్ చేయాలని అమ్మ కోరుకుని ఉంటారు అనేది మీడియా వర్గాల టాక్‌. తమిళ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో అమ్మ గురించి ప్రత్యేకంగా చర్చ మళ్లీ సోషల్‌ మీడియాలో మొదలు అయ్యింది.

అమ్మ కోరుకున్నట్లుగా తలైవి సినిమాను ఐశ్వర్య రాయ్ చేసి ఉంటే బాగుండేది. అమ్మ ఆత్మ శాంతించేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే అమ్మ జీవిత చరిత్రపై సినిమా వెబ్‌ సిరీస్ వచ్చింది. అమ్మ కోరికతో ఐశ్వర్య రాయ్ తో సినిమాను ఎవరైనా ప్లాన్‌ చేస్తారేమో చూడాలి. తలైవి సినిమాకు మొదటి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు కాలేదు అనేది ట్రేడ్‌ వర్గాల వారి స్పందన. కరోనా పరిస్థితులు కాకుండా ఉంటే ఖచ్చితంగా సినిమాకు భారీగానే వసూళ్లు నమోదు అయ్యేవి అనేది కొందరి వాదన. కంగనా అభిమానులు మాత్రం ఈ సినిమాను వంద కోట్ల సినిమాగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరి తలైవి ఎంత వరకు వసూళ్లను రాబట్టనుందో చూడాలి.