Begin typing your search above and press return to search.

రష్మికను విచారించబోతున్న ఐటీ అధికారులు

By:  Tupaki Desk   |   17 Jan 2020 7:21 AM GMT
రష్మికను విచారించబోతున్న ఐటీ అధికారులు
X
టాలీవుడ్‌ లో ప్రస్తుతం టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నకు ఐటీ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆమె ప్రాంతం అయిన కర్ణాటక కొడగు జిల్లా విరాజ్‌ పేటలో ఆమె తండ్రి ఆఫీస్‌ లపై ఐటీ అధికారులు దాడులు చేయడం జరిగింది. ఆ సమయంలో చెన్నైలో ఒక తమిళ చిత్రం షూటింగ్‌ లో పాల్గొంటున్న రష్మిక మొదట ఐటీ దాడులను మామూలుగానే పరిగణించింది. తన తండ్రికి సంబంధించిన వ్యాపార సంస్థలపై ఐటీ దాడులుగా భావించింది. కాని ఆ సమయంలోనే రష్మిక పేరుపై ఉన్న పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు గుర్తించారట.

ముఖ్యంగా 50 ఎకరాల కాఫీ తోటకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ ను ఐటీ అధికారులు స్వాదీనం చేసుకున్నారని తెలుస్తోంది. రష్మిక ఆదాయానికి మించిన ఆస్తులు చాలా ఉన్నాయని ఐటీ అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేయడం జరిగింది. రష్మిక పేరుపై ఉన్న ప్రతి ఒక్క ఆస్తికి సంబంధించిన లెక్కలను క్లీయర్‌ గా చూపించాల్సిందిగా ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. నేడు ఐటీ అధికారుల ముందుకు వెళ్లి రష్మిక లెక్కలు చెప్పాల్సి ఉంటుంది.

రష్మిక ఒక వేళ తన పేరున ఉన్న ఆస్తులకు లెక్కలు చెప్పలేని పక్షంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రష్మికను అరెస్ట్‌ చేసే అవకాశం కూడా ఉందంటూ కన్నడ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎవరో కావాలని రష్మికను ఇలా ఇరికించేందుకు ఐటీ అధికారులకు సమాచారం అందించారనే పుకార్లు కూడా కన్నడ సినీ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి. ఏది ఏమైనా కూడా రష్మిక ప్రస్తుతం పెద్ద చిక్కుల్లో పడింది. వాటి నుండి ఈ అమ్మడు ఎలా బయటకు వస్తుందో చూడాలి.