Begin typing your search above and press return to search.

కొత్త సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ పై షరతులు విధిస్తారా..?

By:  Tupaki Desk   |   15 Jun 2022 4:39 AM GMT
కొత్త సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ పై షరతులు విధిస్తారా..?
X
కరోనా పాండమిక్ సమయంలో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అనేవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కొన్ని నెలల పాటు థియేటర్లు మూతబడి ఉండటంతో.. నిర్మాతలు నష్టాల నుంచి బయట పడటానికి ఓటీటీలను ఆశ్రయించారు. ఓటీటీలు సైతం డైరెక్ట్ ఓటీటీ రిలీజులతో వీక్షకులను ఆకట్టుకోడానికి ఫ్యాన్సీ రేట్లకే సినిమాలను తీసుకుంటూ వచ్చాయి. ఈ క్రమంలో పెద్ద చిత్రాలను కూడా నెల తిరక్కుండానే డిజిటల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే విధానాన్ని మొదలుపెట్టారు.

డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీలు భారీ ధరలు చెల్లిస్తుండటంతో.. నిర్మాతలు హ్యాపీగా డీల్స్ సెట్ చేసుకుంటున్నారు. అయితే ఓటీటీల వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉందనే విషయాన్ని మేకర్స్ గుర్తించలేకపోయారు. డిజిటల్ వేదికల హవా పెరగడంతో శాటిలైట్ రైట్స్ రేట్లు పడిపోవడమే కాదు.. మొత్తం థియేటర్ వ్యవస్థపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది.

ఒకప్పుడు థియేట్రికల్ రిలీజైన సినిమాలు ఎప్పటికో ఓటీటీలోకి వచ్చేవి కావు. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా మూడు వారాలకే డిజిటల్ వేదికల మీదకు వస్తున్నాయి. దీంతో ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు.. ఎలాగూ కొన్ని రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది కదా అన్న ఆలోచనతో థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు.

ఇలా సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గిపోతుండటంతోతో మెల్లి మెల్లిగా థియేటర్ సిస్టమ్ కు ప్రమాదం వాటిల్లే పరిస్థితితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో ఓటీటీల ప్రభావం - థియేటర్ వ్యవస్థ మీద టాలీవుడ్ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రస్తుత సినీ ఇండస్ట్రీ పరిస్థితులపై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. టికెట్ల రేట్లు తగ్గించాలి.. ఓటీటీల్లో ఆలస్యంగా సినిమాను వేయాలనేదే ఇప్పుడు ఇండస్ట్రీ నేర్చుకోవల్సిన పాఠమని అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులు థియేటర్లకు రావడం చాలా వరకు తగ్గించారని.. తిరిగి వారిని థియేటర్లకు రప్పించే బాధ్యత సినిమా ఇండస్ట్రీపైనే ఉందన్నారు అల్లు అరవింద్. సినిమా టికెట్ రేట్లు తగ్గించి, ఓటీటీల్లో సినిమాలను ఆలస్యంగా రిలీజ్ చేస్తేనే ఈ పరిస్థితులు మెరుగుపడతాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

లేటెస్టుగా అల్లు ఫ్యామిలీకి సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాసు సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తపరిచారు. బాలీవుడ్ లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోతుండటంతో.. థియేట్రికల్ రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే కండిషన్ పెట్టుకున్నారని తెలిపారు. టాలీవుడ్ లో కూడా ఇలాంటి కండిషన్లు రాబోతున్నాయని సంకేతాలు ఇచ్చారు.

మూడు వారాలకే సినిమాలు ఓటీటీల్లో వచ్చేస్తుండటంతో జనాలు థియేటర్లకు ఏం వెళ్తాంలే అనుకుంటున్నారని.. అందుకే ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కఠినంగా ఉండాలని బన్నీ వాసు అభిప్రాయ పడ్డారు. ఇప్పటికే నిర్మాతల్లో దీనిపై చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే ఒక ప్రకటన వస్తుందని తెలిపారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చే సినిమాల వరకు థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఐదు వారాల్లోపు డిజిటల్ రిలీజ్ ఉండకూడదని నియమం పెట్టుకున్నామని బన్నీ వాసు వెల్లడించారు. దీనిని బట్టి టాలీవుడ్ పెద్దలు ఓటీటీ స్ట్రీమింగ్ గురించి తీవ్రంగా చర్చిస్తున్నట్లు అర్థం అవుతోంది.

ఇప్పటికే 'మేజర్' 'ఎఫ్ 3' 'అంటే సుందరానికి' చిత్రాల నిర్మాతలు రెండు నెలల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ చేసేలా నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఓటీటీ విడుదలలపై ఎలాంటి నిబంధనలు వస్తాయో.. అవి ఎంత వరకు సానుకూల ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.