Begin typing your search above and press return to search.

క్రియేటివ్ డైరెక్టర్ అలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడా..?

By:  Tupaki Desk   |   26 Aug 2022 12:30 AM GMT
క్రియేటివ్ డైరెక్టర్ అలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడా..?
X
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడాయన. 'గులాబీ' 'నిన్నే పెళ్లాడుతా' 'సింధూరం' 'అంతఃపురం' 'మురారి' 'ఖడ్గం' 'రాఖీ' 'చందమామ' వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు.

అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా రాణించిన కృష్ణవంశీ.. గత కొంతకాలంగా తన రేంజ్ కు తగ్గ సక్సెస్ అందుకోలేకపోతున్నారు. 'శశిరేఖ పరిణయం' 'మొగుడు' 'పైసా' 'గోవిందుడు అందరివాడేలే' వంటి పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాయి. చివరగా 2017లో తీసిన 'నక్షత్రం' మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

దీంతో దాదాపు ఐదేళ్ల గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ.. ఇప్పుడు మళ్లీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ను అలరించడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ''రంగమార్తాండ'' చిత్రాన్ని పూర్తి చేశారు. ఇది ‘నటసమ్రాట్’ అనే మరాఠీ మూవీకి తెలుగు రీమేక్. ఇందులో ప్రకాష్ రాజ్ - రమ్యకృష్ణ - బ్రహ్మానందం - అనసూయ - శివాత్మిక - రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

'రంగమార్తాండ' తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ పై దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ''అన్నం - పరబ్రహ్మ స్వరూపం'' అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఇది కృష్ణవంశీ మార్క్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఓ ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కృష్ణ వంశీ ఎప్పటి నుండో ఓ మహిళా ప్రాధాన్యత ఉండే సినిమా చేయాలని ఆలోచిస్తుండగా.. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇటీవలే నిర్ణయించుకున్నారట. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని భావిస్తున్నారట. దీనికి తగ్గట్టుగానే బాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్లను లీడ్ రోల్స్ కోసం తీసుకోవాలని అనుకుంటున్నారట.

ఈ నేపథ్యంలో పూజా హెగ్డే మరియు రకుల్ ప్రీత్ సింగ్ లను కథానాయికలుగా తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారట. వీరిద్దరూ ఆల్రెడీ హిందీలో చేస్తున్నారు కాబట్టి.. పాన్ ఇండియా మార్కెట్ కి హెల్ప్ అవుతుంది. అందుకే స్టార్ హీరోయిన్లను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చి మల్టీలాంగ్వేజ్ మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు.

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ చిత్రాలతో పాటుగా పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ బిజీగా గడుపుతోంది. తెలుగులో అవకాశాలకు దూరమైన రకుల్.. హిందీ తమిళ భాషల్లో సినిమాలు చేస్తోంది. వీరిద్దరూ కృష్ణవంశీ ప్రాజెక్ట్ లో భాగం అవుతారని అనుకుంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.