Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో సినిమా గురించి చెప్పకనే చెప్పిన 'కేజీఎఫ్' డైరెక్టర్...!

By:  Tupaki Desk   |   20 May 2020 12:00 PM GMT
ఎన్టీఆర్ తో సినిమా గురించి చెప్పకనే చెప్పిన కేజీఎఫ్ డైరెక్టర్...!
X
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. యాక్టింగ్ - డ్యాన్స్ - డైలాగ్ డెలివరీ - ఫైట్స్‌ ఇలా అన్నిట్లో రాణిస్తూ అదరగొడుతున్నాడు. కొన్నేళ్లుగా సూపర్ ఫామ్‌ లో ఉన్న ఎన్టీఆర్ వరుస సినిమాలతో వరుస విజయాలతో దూకుడు చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ తో సినిమా తీయడానికి సౌత్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకనిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' లో నటిస్తున్నాడు తారక్. 'ఆర్.ఆర్.ఆర్' తరువాత ఎన్టీఆర్ వేసే అడుగులు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయ్. ఇప్పటి నుంచి పాన్ ఇండియన్ స్టార్ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు ఆ స్థాయి డైరెక్టర్లనే లైన్‌లో పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తారక్ తన కెరీర్లో 30వ చిత్రాన్ని కూడా ఓకే చేసాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తదుపరి సినిమా ఉంటుందని ప్రకటించేశాడు. అంతేకాకుండా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. 'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం 'కేజీఎఫ్ - 2' చిత్రీకరణతో ప్రశాంత్ బిజీగా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ చేసిన ట్వీట్ వీరి కాంబోలో సినిమా ఉండబోతోందని ఒక క్లారిటీ ఇచ్చేశాడు.

ఎన్టీఆర్ కు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ''ఓ న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో ఎట్టకేలకు నేను తెలుసుకున్నాను. మళ్లీ కలిసేటపుడు చుట్టూ ఉన్న ఎనర్జీ నుంచి కాపాడుకోవడానికి రేడియేషన్ సూట్ తెచ్చుకుంటాను. హ్యాపీ బర్త్‌ డే బ్రదర్ తారక్. త్వరలోనే కలుద్దాం'' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ - ప్రశాంత్ మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగినట్లు అర్థం అయిపోయింది. ఎన్టీఆర్ తో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు చెప్పకనే చెప్పాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రస్తుతం ఓకే చేసిన సినిమాలు రెండూ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ 31 సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ న్యూస్ తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'కేజీఎఫ్' లాంటి సినిమా అందించిన డైరెక్టర్ తమ అభిమాన హీరోతో ఎలాంటి సినిమా తీయబోతున్నాడో అంటూ ఇప్పటి నుండే ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా ప్రశాంత్ నీల్ కి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే ఒక సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించే అవకాశం ఉందని చెప్పవచ్చు.