Begin typing your search above and press return to search.

నాగ్‌ అశ్విన్‌ బ్రాండ్‌ వ్యాల్యూ ఇలా వాడేస్తున్నారా?

By:  Tupaki Desk   |   12 Jan 2021 9:30 AM GMT
నాగ్‌ అశ్విన్‌ బ్రాండ్‌ వ్యాల్యూ ఇలా వాడేస్తున్నారా?
X
ఒక్క సినిమా సూపర్‌ హిట్‌ అయ్యిందటే ఆ దర్శకుడి ఇమేజ్‌ విపరీతంగా పెరగడం ఖాయం. ఒకప్పుడు సూపర్‌ హిట్‌ దర్శకులు మహా అయితే తమ పారితోషికాలు పెంచే వారు. కాని ఇప్పుడు ఆ సక్సెస్‌ లను పలు రకాలుగా వినియోగించుకుంటున్నారు. మొదటగా దర్శకుడిగా తదుపరి సినిమాకు విపరీతంగా పారితోషికం పెంచడం.. ఇక ఇతర దర్శకుల సినిమాలకు సలహాలు సూచనలు అందించడం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందడం ఇక చివరగా సూపర్‌ హిట్ తో క్రియేట్‌ అయిన బ్రాండ్ ను ఉపయోగించుకుని నిర్మాతలుగా మారుతున్నారు. పెట్టుబడి పెట్టినా పెట్టకున్నా నిర్మాత అంటూ పేరు ఉండటం వల్ల ఆ సినిమాలకు మంచి పబ్లిసిటీ మరియు క్రేజ్‌ దక్కుతుంది. అందుకే ఈమద్య కాలంలో చాలా మంది దర్శకులు చిన్న సినిమాలకు నిర్మాతలుగా మారిపోతున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ కూడా చేరిపోయాడు.

అశ్వినీదత్ అల్లుడు అయిన నాగ్‌ అశ్విన్‌ చేసినవి సినిమాల రెండే అయినా కూడా స్టార్‌ డైరెక్టర్‌ ఇమేజ్ దక్కించుకున్నాడు. త్వరలో ప్రభాస్ తో ఒక సినిమాను తెరకెక్కించేందుకు నాగీ రెడీ అవుతున్నాడు. ఈ సమయంలోనే ఆయన ఇతర సినిమాలకు మరియు వెబ్‌ సిరీస్ లకు తన ఐడియాలను షేర్ చేయడం తన ఆలోచనలు ఇవ్వడం చేస్తున్నాడు. ఇక అశ్వినీదత్‌ కూతుర్లు ప్రారంభించి నిర్వహిస్తున్న స్వప్న సినిమా బ్యానర్ లో రాబోతున్న సినిమాలను కూడా పర్యవేక్షిస్తున్నాడు. తాజాగా స్వప్న సినిమా బ్యానర్‌ లో జాతిరత్నాలు అనే సినిమా తెరకెక్కింది.

నవీన్ పొలిశెట్టి నటించిన ఈ సినిమాకు కేవీ అనుదీప్‌ దర్శకత్వం వహించాడు. సాదారణంగా స్వప్న సినిమా లకు నిర్మాతగా టైటిల్ కార్డ్‌ ప్రియాంక దత్ అని పడుతుంది. కాని ఈసారి నాగ్‌ అశ్విన్‌ అని వేశారు. సినిమాకు నిర్మాత నాగ్‌ అశ్విన్‌ అంటూ వేయడం వల్ల బ్రాండ్ వ్యాల్యూ తో సినిమాకు పబ్లిసిటీ వస్తుంది. దానికి తోడు సినిమా స్క్రిప్ట్‌ షూటింగ్ ఇలా అన్ని విషయాల్లో కూడా నాగ్‌ అశ్విన్‌ సలహాలు సూచనలు ఇచ్చారు. కనుక నాగ్‌ అశ్విన్‌ పేరును వేయడం జరిగింది. మహానటితో వచ్చిన బ్రాండ్ వ్యాల్యూను నాగ్‌ అశ్విన్‌ ఇలా వాడేస్తున్నారు.