Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   18 Feb 2022 1:30 AM GMT
మెగాస్టార్ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా..?
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కలిసి నటించిన సినిమా ''ఆచార్య''. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2022 ఏప్రిల్ 29న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే అదే రోజున ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ వారు ''ఆచార్య'' చిత్రాన్ని హిందీలో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని పెన్ సంస్థ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. తమ బ్యానర్ లో రూపొందిన ‘గంగుభాయి కతియావాడి’ సినిమా ఫిబ్రవరి 25న.. సినిమా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని హిందీలోనూ మార్చి 25న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

‘అటాక్ పార్ట్-1’ మూవీని ఏప్రిల్ 1న.. ‘జెర్సీ’ హిందీ రీమేక్ ను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఆచార్య’ హిందీ వర్షెన్‌ ను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నామని పెన్ స్టూడియోస్ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. గతంలో చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాని పాన్ ఇండియా స్థాయిలో పలు ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

చిరంజీవికి బాలీవుడ్ లో పెద్దగా మార్కెట్ లేకపోయినా.. పాన్ ఇండియా మార్కెట్ ని లక్ష్యంగా చేసుకుని 'సైరా' సినిమాని హిందీలో రిలీజ్ చేసారు. రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రం అక్కడ నష్టాన్నే మిగిల్చింది. ఇప్పుడు చెర్రీ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ''ఆచార్య'' చిత్రాన్ని పెన్ స్టూడియోస్ సంస్థ హిందీలో విడుదల చేయడానికి రెడీ అయింది. దీంతో మెగాస్టార్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

కానీ ఈసారి నార్త్ లో కూడా చిరు మంచి లాభాలు రాబట్టి తన సత్తా ఏంటో బాలీవుడ్ బాక్సాఫీస్ కు చూపిస్తాడని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అందులోనూ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోతారు. తనయుడి క్రేజ్ కూడా చిరంజీవికి కలిసొచ్చే అవకాశం ఉంది. కొరటాల శివ శైలిలో సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా 'ఆచార్య' చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.

ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. రెజీనా కాసాండ్రా - సంగీత ప్రత్యేక గీతాల్లో కనిపించగా.. సోనూసూద్ - జిషు సేన్ గుప్తా - వెన్నెల కిశోర్ - పోసాని కృష్ణ మురళి - తనికెళ్ళ భరణి - సౌరవ్ లోకేష్ - అజయ్ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఆచార్య' సినిమాకు సంబంధించిన నిర్మాణాంతర పనులు చివరి దశకు చేరుకున్నాయి.