Begin typing your search above and press return to search.

మహేష్ ఇప్పటికైనా ఫ్యాన్స్ కోరిక తీరుస్తాడా...?

By:  Tupaki Desk   |   22 July 2020 4:30 PM GMT
మహేష్ ఇప్పటికైనా ఫ్యాన్స్ కోరిక తీరుస్తాడా...?
X
టాలీవుడ్ లో ఈ మ‌ధ్య పాన్ ఇండియా మూవీ అనే ప‌దం ఎక్కువగా వినిపిస్తోంది. స్టార్ హీరోలు తమ మార్కెట్ ని విస్తరించుకునే ఉద్దేశ్యంతో ఇతర భాషల్లో కూడా తమ చిత్రాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ తీస్తూ పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని ఆశ పడుతున్నారు. అందుకే క్రేజ్ తో ఇమేజ్ తో సంబంధం లేకుండా ప్రతి హీరో కూడా పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేస్తున్నారు. అయితే 'బాహుబలి' సినిమా నుండి ఈ పాన్ ఇండియా మూవీస్ తీయడం ఊపందుకుందని చెప్పవచ్చు. ఈ సినిమా భాషతో సంబంధం లేదంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కాస్తా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ 'పుష్ప'.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'.. ప్రభాస్ 'రాధే శ్యామ్'.. పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో వస్తున్న మూవీ.. ఇలా అందరు స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆది సాయి కుమార్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాన్ ఇండియా మూవీ తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా మహేష్ బాబుకి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ జనాలు కూడా మహేష్ గురించి మాట్లాడుకుంటారు. ఇతర స్టార్ హీరోలతో పోల్చుకుంటే మహేష్ కే ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో టాలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న మహేష్ ఎందుకు ఇతర భాషల్లో సినిమా తీయడం లేదని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. నిజానికి అప్పుడెప్పుడో మహేష్ పాన్ ఇండియా మూవీ తీయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మహేష్ స్పందిస్తూ.. ప్రస్తుతానికి నేను తెలుగులోనే సినిమాలు తీద్దాం అనుకుంటున్నాను.. టాలీవుడ్ లో నిరూపించుకోవాల్సింది చాలా ఉంది అని కామెంట్స్ చేసారు. ఈ స్టేట్మెంట్ కి కట్టుబడి టాలీవుడ్ లోనే సినిమాలు తీస్తూ వచ్చారు. లేటెస్టుగా అనౌన్స్ చేసిన 'సర్కారు వారి పాట' ఏ భాషల్లో నిర్మితమవుతోంది అనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పుడు అందరూ హీరోలు మార్కెట్ విస్తరించుకునే ప్లాన్ లో ఉన్నారు కాబట్టి మహేష్ కూడా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా మహేష్ - రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న మూవీ మాత్రం కచ్చితంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది. అయితే పాన్ ఇండియా మూవీ తీయాలంటే రాజమౌళి లాంటి డైరెక్టర్ ఉంటేనే ముందుకు వస్తాడా.. మహేష్ కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ పని చేయదా అని కామెంట్స్ చేసే వాళ్ళు లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితులను బట్టి ఓటీటీలో రిలీజ్ చేసే సినిమాలు కూడా ఇతర భాషల్లో నిర్మించబడుతున్నాయి. మరి మహేష్ కూడా ఫ్యాన్స్ కోరిక మేరకు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి ముందుకొస్తాడేమో చూడాలి.