Begin typing your search above and press return to search.

జేమ్స్ కామెరాన్ మ‌రో సారి మెస్మ‌రైజ్ చేశాడా?

By:  Tupaki Desk   |   17 Dec 2022 10:41 AM GMT
జేమ్స్ కామెరాన్ మ‌రో సారి మెస్మ‌రైజ్ చేశాడా?
X
యావ‌త్ సినీ ప్ర‌పంచ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన జేమ్స్ కామెరాన్ అద్భుతసృష్టి 'అవ‌తార్ 2'ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానే వ‌చ్చేసింది. ప‌ద‌మూడేళ్ల క్రితం వ‌చ్చిన 'అవ‌తార్' సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహితుల్ని చేసి విజువ‌ల్ వండ‌ర్ గా ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా రికార్డు స్థాయిలో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ఇలాంటి సినిమాకు సీక్వెల్ రానుంద‌ని ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి ఈ మూవీ కోసం అంతా ఆస‌క్తిగా ఎదురు చూడ‌టం మొద‌లు పెట్టారు.

'అవ‌తార్‌'లో ఊహించ‌ని విధంగా పండొరాని ప‌రిచ‌యం చేసిన కామెరూన్ సీక్వెల్ లో ఎలాంటి అద్భతాలు సృష్టించ‌బోతున్నారో అనే ఆస‌క్తిని ప్ర‌తీ ఒక్క‌రిలోనూ మొద‌లైంది. తొలి పార్ట్ లో ప్ర‌త్యేక లోకంలో విహ‌రించిన అనుభూతిని క‌లిగించిన జేమ్స్ కెమెరాన్ సీక్వెల్ కోసం స‌ముద్ర‌పు నీటి అడుగున వున్న ప్ర‌పంచం నేప‌థ్యంలో భారీ జ‌ల‌చ‌రాల‌తో ప్రేక్ష‌కుల్ని సంబ్రమాశ్చ‌ర్యాల‌కు లోను చేయాల‌ని ప్లాన్ చేశారు. అవ‌తార్ తో అబ్బుర ప‌రిచిన జేమ్స్ కెమెరూన్ సీక్వెల్ తో అదే మ్యాజిక్ ని రిపీట్ చేశాడా?.. ఫ‌స్ట్ పార్ట్ బ‌డ్జెట్ ని మించి భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన సీక్వెల్ ల‌క్ష్యాన్ని చేరుకుంటుందా? అన్నిది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ప‌ద‌హారు వేల కోట్ల బ్రేక్ ఈవెన్ ల‌క్ష్యంగా బ‌రిలో దిగిన 'అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్‌' తొలి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. జేమ్స్ కెమెరూన్ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో భారీ స్థాయిలో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీకి ప్రీమియ‌ర్ షోల నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావ‌డం మొద‌లైంది. కానీ ప్రేక్ష‌కులు ఈ టాక్ ని ప‌ట్టించుకోకుండా విజువ‌ల్ వండ‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీని చూడ‌టానికి థియేట‌ర్ల‌కు భారీ స్థాయిలో పోటెత్తారు.

అయితే తొలి భాగాన్ని మించి అవ‌తార్ 2 మాత్రం లేద‌నే టాక్ వినిపిస్తోంది. కార‌ణం ఫ‌స్ట్ పార్ట్ త‌ర‌హాలో పండోరా ప్ర‌పంచాన్ని కొత్త‌గా ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు నిడివి విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని వుంటే బాగుండేద‌ని కొంత మంది పెదవి విరుస్తున్నారు. 'అవ‌తార్' నిడివి 162 మినిట్స్ మాత్ర‌మే కానీ సీక్వెల్ నిడివి మాత్రం 192 మినిట్స్ అంటే మూడు గంట‌ల ప‌న్నెండు నిమిషాల‌న్న‌మాట‌. ఇదే ఇప్ప‌డు అవతార్ సీక్వెల్ కు ఇబ్బందిక‌రంగా మారిన‌ట్టు తెలుస్తోంది.

ఫ‌స్ట్ హాఫ్ లాగ్ అనిపించ‌డం.. ప్ర‌ధాన క‌థ మొద‌లు కావ‌డానికి స‌మ‌యం ప‌ట్ట‌డంతో కొంత వ‌ర‌కు ప్రేక్ష‌కులు అసంతృప్తికి లోన‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా సీక్వెల్ పై ఇండైరెక్ట్ గా పెద‌వి విరుస్తున్నారు. అవ‌తార్ త‌ర‌హాలో సీక్వెల్ ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేయ‌లేద‌న‌డానికి 'అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ వ‌సూళ్ల‌ని అధిగ‌మించ‌క‌పోవ‌డ‌మే సాక్ష్యం అని చెబుతున్నారు. ఇండియా వైడ్ గా అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ రూ.53 కోట్ల గ్రాస్ తో రికార్డుని సాధించింది.

అయితే 'అవ‌తార్‌' సీక్వెల్ ఆ రికార్డుని తుడిచి పెట్టేస్తుంద‌ని అంతా భావించారు కానీ అది జ‌ర‌గ‌లేదు. 'అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్‌' దేశ వ్యాప్తంగా ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపుగా రూ. 40 కోట్ల‌ని మాత్ర‌మే రాబ‌ట్టి షాకిచ్చింది. ఇంత‌టి క్రేజ్ వున్న సినిమా ఈ స్థాయిలో మాత్ర‌మే వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిందంటే అనుకున్న రేంజ్ లో మెస్మ‌రైజ్ చేయ‌లేక‌పోవ‌డ‌మే న‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కైతే షోస్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో అవ‌తార్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్తిస్తుందో వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.