Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' పాటపై ఐపీఎస్ ఆఫీసర్ ఫైర్..!

By:  Tupaki Desk   |   3 Sep 2021 5:46 AM GMT
భీమ్లా నాయక్ పాటపై ఐపీఎస్ ఆఫీసర్ ఫైర్..!
X
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''భీమ్లా నాయక్''. గురువారం పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి మేకర్స్ టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరపరిచిన ఈ పాట మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం రాయగా.. మొగులయ్య - రామ్ మిరియాల - శ్రీ కృష్ణ - పృథ్వీ చంద్ర కలిసి ఈ గీతాన్ని ఆలపించారు.

హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా 'ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ.. ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా.. నిమ్మళంగ కనబడే నిప్పుకొండ.. ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా.. ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క.. చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క..' రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ పవన్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 'ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస.. ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస.. కుమ్మడంలో విడే ఒక బ్రాండు తెల్సా.. వీడి దెబ్బతిన్న ప్రతీవాడు పాస్టుటెన్సా..' అనే పదాలు పవన్ కోసమే పుట్టినట్లు ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

'భీమ్లా నాయక్' చిత్రంలో సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని రామజోగయ్య శాస్త్రి ఈ లిరిక్స్ రాశారు. అయితే ఈ సాహిత్యం విని రియల్ పోలీస్ కాస్త అప్సెట్ అయ్యారు. తెలంగాణ సీనియర్ ఐపిఎస్ అధికారి మరియు హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిసిపి ఎం.రమేష్ ఈ పాటలో వాడిన పదాలపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

''థ్యాంక్ ఫుల్లీ.. తెలంగాణా కాప్స్ ఫ్రెండ్లీ పోలీసులు. మేము రక్షించే వాళ్ళమే కానీ.. ఎముకలు విరగొట్టే వాళ్ళం కాదు. ఆశ్చర్యకరంగా, రామజోగయ్య శాస్త్రికి పోలీసుల పరాక్రమాన్ని వర్ణించడానికి తెలుగులో సరైన పదాలు దొరకలేదు. పాటలో పోలీసుల సేవ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు'' అని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ ట్వీట్ చేశారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాసిన విధానాన్ని విమర్శిస్తూ పోలీస్ ఆఫీసర్ పెట్టిన ట్వీట్ కు నెటిజన్స్ నుంచి మద్దతు లభిస్తోంది.

కాగా, 'భీమ్లా నాయక్' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' చిత్రానికి అధికారిక రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్.. రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.