Begin typing your search above and press return to search.

ఇళయరాజా ప్రసాద్‌ స్టూడియో వివాదం ముగిసింది

By:  Tupaki Desk   |   29 Dec 2020 4:10 PM IST
ఇళయరాజా ప్రసాద్‌ స్టూడియో వివాదం ముగిసింది
X
చెన్నైలోని ప్రసాద్‌ స్టూడియోలో ఇళయరాజా కోసం ఒక ప్రత్యేకమైన రికార్డింగ్‌ స్టూడియో ఉంది. 1976లో అప్పటి యాజమాన్యం స్టూడియోలో ఇళయరాజా కోసం గుడ్‌ విల్‌ కింద రికార్డింగ్‌ స్టూడియోను ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. కాలం మారుతున్నా కొద్ది స్టూడియోను మార్చుతూ వచ్చారు. కాని ఇళయరాజా రికార్డింగ్‌ స్టూడియో మాత్రం అక్కడే ఉంటూ వచ్చింది. ఈమద్య కాలంలో స్టూడియోను మరింతగా మార్చేందుకు ప్రసాద్‌ స్టూడియో వారసులు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసం అడ్డుగా ఉన్న ఇళయరాజా రికార్డింగ్‌ స్టూడియోను తొలగించాలని నిర్ణయించారు.

మొదట ఇళయరాజా కోసం వేరే చోట రికార్డింగ్‌ స్టూడియోను ఏర్పాటు చేస్తామంటూ ప్రసాద్‌ స్టూడియో వారసులు సూచించారు. కాని ఇళయరాజా మాత్రం ప్రసాద్‌ స్టూడియోను వదిలేది లేదు అంటూ తేల్చి చెప్పాడు. దాంతో వివాదం కోర్టు వరకు వెళ్లింది. కొందరు ఇళయరాజా తీరును తప్పుబట్టారు. కోర్టు కూడా ఈ విషయాన్ని చర్చించుకుని పరిష్కరించుకుంటే బాగుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేసింది. ఇరు వర్గాల వారు ఎట్టకేలకు రాజీకి ఓకే చెప్పారు. స్టూడియో నుండి తప్పుకునేందుకు ఇళయరాజా ఒప్పుకున్నారు. ఆయన వెళ్లి తన స్టూడియో సామానును తెచ్చుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే స్టూడియోలోకి వెళ్లేందుకు మనసు ఒప్పుకోక పోవడంతో ఆయన సన్నిహితులు మరియు లాయర్ వెళ్లి అవార్డులు మరియు మ్యూజిక్‌ ఇన్సిమెంట్స్ ను తీసుకు వచ్చేశారు.