Begin typing your search above and press return to search.

ఇళయరాజాదే తప్పంటున్న సినీ జనాలు

By:  Tupaki Desk   |   3 Aug 2020 10:00 PM IST
ఇళయరాజాదే తప్పంటున్న సినీ జనాలు
X
చెన్నైలోని ప్రసాద్‌ స్టూడియోలో ఉన్న ఇళయరాజా మ్యూజిక్‌ స్టూడియోకు సంబంధించి గత కొన్ని రోజులుగా వివాదం సాగుతున్న విషయం తెల్సిందే. దాదాపుగా అయిదు దశాబ్దాల క్రితం ఎల్వీ ప్రసాద్‌ గారు ప్రసాద్‌ స్టూడియోలో ఇళయరాజాపై అభిమానంతో మరియు గౌరవార్థంగా కొంత ప్లేస్‌ ను ఇవ్వడంతో పాటు ఒక రూంను స్టూడియో కోసం ఇవ్వడం జరిగింది. ఎల్వీ ప్రసాద్‌ తనయుడు రమేష్‌ ప్రసాద్‌ హయాంలో కూడా ఆ స్టూడియో అలాగే కొనసాగింది. రమేష్‌ ప్రసాద్‌ తనయుడు సాయి ప్రసాద్‌ స్టూడియోను మోడ్రన్‌ గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇళయరాజాకు అప్పట్లో ఇచ్చిన రూం ఇబ్బందిగా మారింది. ఆ రూంను ఖాళీ చేయమంటూ గత కొన్ని రోజులుగా సాయి ప్రసాద్‌ విజ్ఞప్తి చేయడం జరిగింది.

సాయి ప్రసాద్‌ విజ్ఞప్తిని ఇళయరాజా కొట్టి పారేశాడు. మొదట సాదారణంగానే చెప్పి చూసిన సాయి ప్రసాద్‌ ఆ తర్వాత కాస్త సీరియస్‌ గానే అప్రోచ్‌ అయ్యాడు అనేది తమిళ సినీ వర్గాల మాట. ఇళయరాజా మాత్రం తన మొండితనంతో గొడవను మరింత ముదిరేలా చేశాడు. ఇళయరాజా మొండి వైఖరితో ఆ స్టూడియోను ఖాళీ చేయను అంటున్నాడు అంటూ తమిళ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇళయరాజాకు ప్రత్యామ్నాయంగా మరో స్టూడియోను చూపించేందుకు సాయి ప్రసాద్‌ రెడీగా ఉన్నా కూడా ఇళయరాజా మాత్రం గొడవను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ కోలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలోనే రాయల్టీ పేరుతో నానా రచ్చ చేసి ఇండస్ట్రీలో చెడ్డ పేరు దక్కించుకున్న ఇళయరాజా ఈసారి మరింతగా చెడ్డ పేరును మూట కట్టుకుంటున్నట్లుగా తమిళ మీడియాలో కూడా ఒక వర్గం కామెంట్స్‌ చేస్తోంది. సినీ పరిశ్రమ అభివృద్దిలో ఎంతో కీలకమైన ఎల్వీ ప్రసాద్‌ గారి కుటుంబంపై కోర్టుకు వెళ్లడం ఏంటీ అంటూ ఇప్పటికే సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఇళయరాజాపై మండి పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివాదంను ముగిస్తే ఇళయరాజాకు గౌరవంగా ఉంటుందని లేదంటే మరింతగా ఆయన పరువు పోతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇళయరాజా స్పందన ఏంటో చూడాలి.