Begin typing your search above and press return to search.

నేను సినిమా అంటూ తీస్తే.. ప్రభాస్ తోనే!

By:  Tupaki Desk   |   26 Jan 2021 12:30 PM GMT
నేను సినిమా అంటూ తీస్తే.. ప్రభాస్ తోనే!
X
‘మహానటి’తో సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు నాగ్‍ అశ్విన్‍. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో మరో జాక్ పాట్ కొట్టేశాడు. తన సెకండ్ మూవీలో పాన్‍ ఇండియా సూపర్‍స్టార్‍ ప్రభాస్‍ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథ చెప్పి రెబల్ స్టార్ ను ఒప్పించిన నాగ్ అశ్విన్.. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకోన్‍ చేత కూడా ఓకే చెప్పించాడు. ఇంకేముంది.. అంతా క్లియర్ అనుకున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘రాధేశ్యామ్’ తర్వాత తన చిత్రమే మొదలవుతుందని భావించాడు.

కానీ.. అనుకున్నవన్నీ జరిగితే అది ఇండస్ట్రీ ఎందుకు అవుతుంది? ‘రాధేశ్యామ్’ పూర్తికాకుండానే.. ‘ఆదిపురుష్‍’ మధ్యలో వచ్చి చేరింది. ఆ వెంటనే ‘సలార్‍’ కూడా లైన్లోకి వచ్చింది. రావడమే కాదు.. ‘ముందొచ్చిన చెవులకంటే.. వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్న సామెతను నిజం చేస్తూ.. ఈ మూవీ ప్రారంభం కూడా జరిగిపోయింది. ‘ఆదిపురుష్’ తొలి షెడ్యూల్ కూడా ప్రభాస్ లేకుండానే పట్టాలెక్కబోతోంది.

ఈ విధంగా.. ప్రభాస్ ఆ సినిమాలతో బిజీ కావడంతో.. ఈ ఏడాది మొత్తం నాగ్‍ అశ్విన్‍కు డేట్స్ ఇచ్చే పరిస్థితి క‌నిపించ‌ట్లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇత‌ర‌ దర్శకులు వేరే ఆప్షన్‍ వెతుక్కుంటారు. లేదంటే.. ఈ గ్యాప్ లో మ‌రోసినిమాను స్టార్ట్ చేస్తారు. కానీ.. నాగ్‍ అశ్విన్‍ మాత్రం ప్రభాస్‍ ఎప్పుడు వస్తే అప్పుడే సినిమా చేస్తానంటూ కూర్చున్నాడు.

తన రెండో సినిమా ప్ర‌భాస్ తోనే వ‌స్తుంద‌ని చెబుతున్నాడ‌ట అశ్విన్‌. ఈలోగా టైం వేస్ట్ చేయ‌కుండా.. త‌న మామ అశ్వ‌నీద‌త్ బ్యాన‌ర్‌ వైజయంతి మూవీస్‍ పతాకంపై సినిమాలు నిర్మించే ప‌నిలో ప‌డ్డాడు. అశ్వనీదత్‍ జమానా ముగిసిన నేప‌థ్యంలో.. ఈ తరానికి నచ్చే కథలను ఎంచుకుని బ్యానర్‍కు కొత్త కళ తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నాడు అశ్విన్‌. అదేవిధంగా.. నెట్‍ఫ్లిక్స్ కోసం ‘పిట్టకథలు’ సినిమాలో ఒక భాగం డైరెక్ట్ చేశాడు. ప్రభాస్‍ ఫ్రీ అయ్యేలోగా.. ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు, పనులు చూసుకుంటూ కాలం గడిపేస్తానని సన్నిహితులతో చెప్తున్నాడట అశ్విన్.