Begin typing your search above and press return to search.

ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలియదు: ఈషా రెబ్బా

By:  Tupaki Desk   |   17 April 2022 2:30 AM GMT
ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలియదు: ఈషా రెబ్బా
X
తెలుగు తెరపై తెలుగు అమ్మాయిలు నెగ్గుకు రావడం అంత తేలికైన పనేం కాదు. అయినా ఈషా రెబ్బా తెలుగులో నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. కెరియర్ ఆరంభంలో చిన్న చిన్న సినిమాల్లో కనిపించిన ఈషా రెబ్బా, ఆ తరువాత 'అరవింద సమేత' .. ' రాగల 24 గంటల్లో' సినిమాలతో ఇక దారిలో పడినట్టే అనుకున్నారు. కానీ ఆ తరువాత కూడా ఆమె కెరియర్ గ్రాఫ్ ఎంతమాత్రం మారలేదు. తాజా ఇంటర్వ్యూలో ఈషా మాట్లాడుతూ తన గురించి అనేక విషయాలను వెల్లడించింది.

"నా కెరియర్ ను మొదలుపెట్టిన కొత్తలో వరుసగా మూడు సినిమాలను ఇంద్రగంటి మోహనకృష్ణగారితో చేశాను. అలా ఆయన సినిమాలలో చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తుంటాను. 'అంతకుముందు ఆ తరువాత' .. 'బందిపోటు' .. 'అమీ తుమీ' చేశాను. ఈ మూడింటిలో 'అమీ తుమీ' అంటే నాకు చాలా ఇష్టం.

ఆ కథను .. పాత్రను నేను ఇంతవరకూ మరిచిపోలేదు. ఈ మధ్య ఆయనతో చేయడం కుదరలేదు. నాకు తగిన పాత్ర .. నేను చేస్తే బాగుంటుందనే పాత్ర అయితే ఆయన నాకే చెబుతారు.

నా కెరియర్లో కూడా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. కాకపోతే అవి ఎన్నో ఉండవు. నాగశౌర్యతో ఒక సినిమా చేయవలసింది. ఆ సినిమాను భవ్య క్రియేషన్స్ వారు నిర్మించవలసింది. కారణాలు నాకు తెలియదు గానీ ఆ సినిమా ఆగిపోయింది.

అనుకున్న అన్ని ప్రాజెక్టులు పూర్తి కావు .. కొన్ని అవుతాయి .. మరికొన్ని కావు .. అలా జరుగుతూనే ఉంటాయి. అలాంటివాటిని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా వచ్చిన అవకాశాలతో ముందుకు వెళ్లిపోవడమే.

ఇక ఇంట్లో వాళ్లు పెళ్లి విషయంలో నాపై ఒత్తిడి తీసుకురారు. పెళ్లి ఎప్పుడు? .. ఏ నిర్ణయం తీసుకున్నావు? అని అడుగుతారు. 'అప్పుడే కంగారు ఏవుంది? అని నేను అంటూ ఉంటాను . కెరియర్ పరంగా నేను ఇంకా మంచి స్థాయికి చేరుకోవాలి. అప్పుడే పెళ్లి గురించి ఆలోచన చేస్తాను' అని చెప్పుకొచ్చింది.

ఒక వైపున తెలుగు నుంచి మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తూనే, మరో వైపున తమిళ .. మలయాళ సినిమాలపై ఈషా దృష్టి పెట్టింది. ఇప్పుడిప్పుడే అవకాశాలను అందుకుంటోంది. అక్కడ ఆమె ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి మరి.