Begin typing your search above and press return to search.

గాయత్రీ మంత్రంతో నిద్ర లేస్తా...బీఫ్‌ ను కుమ్మేస్తా

By:  Tupaki Desk   |   19 Feb 2016 4:23 PM GMT
గాయత్రీ మంత్రంతో నిద్ర లేస్తా...బీఫ్‌ ను కుమ్మేస్తా
X
హిందుత్వ‌వాదులు గాయ‌త్రీ మంత్రాన్ని ఎంతగా గౌర‌విస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాగే గోవును కూడా. అయితే గాయత్రీ మంత్రాన్ని గౌర‌వించే వారు బీఫ్‌ను తింటే? ఆలోచ‌న వింత‌గా ఉందా? ఈ కొత్త ఆలోచ‌న‌ను తాను పాటిస్తున్నట్లు పాపుల‌ర్ ప‌ర్స‌న్ ఒక‌రు సెల‌విచ్చారు మ‌రి.

జేఎన్‌ యూ వివాదంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తున్న సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ ఈ స్టేట్‌ మెంట్ ఇచ్చారు. తన బ్లాగ్ లో తాజాగా అభిప్రాయాలు వెల్ల‌డించారు. గాయత్రీ మంత్రంతో నిద్ర లేచే తాను...బాగా వండిన గొడ్డు మాంసాన్ని ఇష్టంగా తింటానని ప్ర‌క‌టించారు. అందుకు తాను దేశ ద్రోహినే అంటూ స్టేట్‌ మెంట్ ఇచ్చుకున్నారు. రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛను గట్టిగా విశ్వసిస్తానని రాజ్‌ దీప్ చెప్పారు. తొలుత సామాజిక మాధ్యమాల్లో తనను దేశ ద్రోహిగా అభివర్ణించినప్పుడు చాలా ఆగ్రహానికి లోనయ్యానని రాజ్ దీప్ సర్దేశాయ్ తన బ్లాగ్‌ లో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పడు...ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనించాక, దేశభక్తి సర్టిఫికేట్లను ఉదారంగా పంచుతున్న పరిణామాలను పరిగణనలోనికి తీసుకున్న తరువాత తనకు దేశద్రోహిగా ఉండేందుకు గర్వపడుతున్నానని అరవాలని భావిస్తున్నట్లు తన బ్లాగ్‌ లో రాసుకున్నారు.

‘ఔను నేను దేశ ద్రోహినే...ఎందుకంటే జేఎన్‌ యూ విద్యార్థులు అప్జల్ గురుకు మద్దతుగా నినాదాలు చేసినప్పుడు అది వేర్పాటు వాద చర్యగా నాకు అనిపించలేదు. విద్యార్థులు (వారందరూ విద్యార్థులా కాదా అన్నది తెలియదు) భారత్ కి బర్బాదీ వంటి నినాదాలు చేస్తున్న వీడియో సాక్ల్యాలు కూడా ఉన్నప్పటికీ వారు వేర్పాటు వాద చర్యలకు పాల్పడ్డారని భావించలేం. ఎందుకంటే ఇప్పటికీ మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే ను వీరుడిగా హిందూ మహాసభ ప్రస్తుతిస్తూనే ఉంది. ఏటా జనవరి 30న మహాత్మా గాంధీ హత్య జరిగిన రోజును నాధూరాం గాడ్సేను కీర్తిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. దేశమంతా మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తున్న రోజు హిందూ మహాసభ నాధూరాం గాడ్సేను కీర్తిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందుకు హిందూ మహాసభను దేశ ద్రోహ సంస్థగా భావిస్తామా? బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ గాడ్సేకు మద్దతుగా మాట్లాడటం దేశ ద్రోహం అవునా? కాదా? లేకపోతే జాతీయత నిర్వచనం అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా మారిపోతూ ఉంటుందా? అని రాజ్‌ దీప్ త‌న భావాల‌ను పంచుకున్నారు.