Begin typing your search above and press return to search.

సెట్స్ మీదకు వెళ్లకుముందే క్రేజీ ప్రాజెక్ట్ కు భారీ ఆఫర్స్..!

By:  Tupaki Desk   |   11 Jun 2022 11:30 AM GMT
సెట్స్ మీదకు వెళ్లకుముందే క్రేజీ ప్రాజెక్ట్ కు భారీ ఆఫర్స్..!
X
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లది క్రేజీ కాంబినేషన్. ఇంతకముందు వీరి కలయికలో వచ్చిన 'అతడు' 'ఖలేజా' చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో.. ఇప్పుడు వీరిద్దరూ #SSMB28 కోసం మళ్లీ జతకట్టబోతున్నారు.

మహేష్ బాబు నటించే 28వ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని ఏడాది క్రితమే అధికారికంగా ప్రకటించారు. 2022 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు SSMB28 చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో షూటింగ్ ప్రారంభం కాకముందే నిర్మాతలకు అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. అయితే మేకర్స్ మాత్రం డీల్స్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదంట.

ఇకపోతే తూర్పుగోదావరి ప్రాంతంలో త్రివిక్రమ్ తన చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేయాలనుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ - త్రివిక్రమ్ కాంబోకి ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉంది.

అయితే SSMB28 సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంపై సూపర్ స్టార్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇదే విషయం మీద సోషల్ మీడియాలో మేకర్స్ ను ప్రశ్నిస్తున్నారు. దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ లో స్పందించారు.

మహేష్ ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ.. ''మీ ఆందోళన నాకు అర్థమైంది అబ్బాయిలు. కానీ దయచేసి మాకు కాస్త సమయం ఇవ్వండి. మేము అప్డేట్ ఇవ్వకూడదనుకోవడం లేదు కదా. 12 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ లో మళ్లీ సినిమా వస్తోంది. ప్రతీ చిన్న విషయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దయచేసి వేచి ఉండండి. #SSMB28 మనందరికీ గుర్తుండిపోతుంది'' అని నాగవంశీ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇదొక పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్ అని సమాచారం. మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే మిగతా ప్రధాన నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రాఫర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు.