Begin typing your search above and press return to search.

'రామాయణ' కోసం రంగంలోకి హృతిక్, రణ్ బీర్!

By:  Tupaki Desk   |   5 Oct 2021 3:50 AM GMT
రామాయణ కోసం రంగంలోకి హృతిక్, రణ్ బీర్!
X
'రామాయణ' .. ఇప్పుడు బాలీవుడ్లో అందరూ కూడా ఈ ప్రాజెక్టును గురించే మాట్లాడుకుంటున్నారు. రామాయణ కథాకావ్యాన్ని ఎన్నిమార్లు విన్నా విలానిపిస్తుంది .. ఎన్నిమార్లైనా తెరపై చూడాలనిపిస్తుంది. ఆ కథా వస్తువులోని ప్రత్యేకత అదే. అలాంటి రామాయణాన్ని ఎంతోమంది రాశారు .. ఎంతోమంది దర్శక నిర్మాతలు తెరకెక్కించారు. ఒక దీపంతో కోటి దీపాలు వెలిగించినా దాని వెలుగు తగ్గదన్నట్టుగా, రామాయణాన్ని ఎవరు ఎన్నిసార్లు తెరకెక్కించినా, ఆ కథలోని రసం .. సారం ఎంతమాత్రం తగ్గవు .. అదే దానిలోని గొప్పతనం.

అలాంటి రామాయణ ఇతివృత్తాన్ని తీసుకుని, ప్రభాస్ హీరోగా 'ఆది పురుష్' సినిమా రూపొందుతోంది. ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇది వందల కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతోంది. ఆల్రెడీ షూటింగు జరుపుకుంటోంది. ఇందులో సీతగా కృతి సనన్ .. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అయోధ్య .. లంకా నగరం .. కిష్కింధ నగరాలకు సంబంధించిన భారీ సెట్లలో చాలా వేగంగా చిత్రీకరణ జరుగుతోంది. పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ఇక ఈ నేపథ్యంలోనే మరో ప్రొడక్షన్ హౌస్ వారు 'రామాయణ' నిర్మించడానికి రంగంలోకి దిగుతుండటం విశేషం. మధు మంతెన .. నమిత్ మల్హోత్ర .. అల్లు అరవింద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్టు కొంతకాలం క్రితమే వార్తలు వచ్చాయి. అయితే కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్ ను .. రావణుడిగా హృతిక్ రోషన్ ను అనుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వారు ఈ సినిమా ఆఫీస్ లో, నిర్మాత నమిత్ మల్హోత్రతో సమావేశమయ్యారు.

ఈ భారీ పౌరాణిక చిత్రానికి నితేష్ తివారి - రవి ఉద్యావర్ దర్శకులుగా వ్యవహరించనున్నారు. దీపావళికి ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సీతాదేవి పాత్రకి ఎవరైతే బాగుంటారా అనే పరిశీలన చేస్తున్నారు. త్వరలోనే ఆ పాత్రకి సంబంధించిన కథానాయిక ఎంపికను పూర్తి చేయనున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం మధు మంతెన ఈ సినిమా ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టగా, నమిత్ మల్హోత్ర విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు. అందుకు సంబంధించిన పనులు జోరుగా జరుగుతున్నాయి.

ఇక ఒక వైపున హృతిక్ రోషన్ 'విక్రమ్ వేద' రీమేక్ చేస్తుండగా, 'బ్రహ్మాస్త్ర' సినిమా పనుల్లో రణ్ బీర్ కపూర్ బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరూ ఈ ప్రాజెక్టులను పూర్తిచేసి, 'రామాయణ' సినిమాపై పూర్తి దృష్టి పెట్టనున్నారు. పాన్ ఇండియా సినిమాగానే ఇది రూపుదిద్దుకోనుంది. ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు రామాయణానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను తెరపై చూపించడానికి సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అసాధ్యమనేది లేనే లేదు. అందువలన అటు 'ఆది పురుష్' .. ఇటు 'రామాయణ' కూడా తెరపై అద్భుతాలు చూపనున్నాయి. ఇక ఈ రెండింటిలో ప్రేక్షకుల మనసులను ఏది ఎక్కువగా కొల్లగొడుతుందో చూడాలి.