Begin typing your search above and press return to search.

వైఎస్ బయోపిక్ టికెట్ రూ.4లక్షలకు ఎలా అమ్మారు అధ్యక్షా?

By:  Tupaki Desk   |   27 Dec 2021 3:28 AM GMT
వైఎస్ బయోపిక్ టికెట్ రూ.4లక్షలకు ఎలా అమ్మారు అధ్యక్షా?
X
అందరూ అన్ని విషయాల్లో ఒకేమాట మీద ఉంటే అసలు సమస్యలే ఉండవు. మనిషికో ఆలోచన.. అభిరుచి ఉంటుంది. నిజానికి ఇదే వ్యక్తుల మధ్య సంఘర్షణకు కారణమవుతుంది. సైద్దాంతికంగా కావొచ్చు.. మరోకోణంలో కావొచ్చు.. అభిప్రాయభేదాలు అన్నవి లేకుంటే.. మానవ ప్రపంచం ముందుకు అడుగు వేయలేదు. అలా అని.. ఈ అభిప్రాయబేధాల్ని వ్యక్తిగత కోపతాపాలకు తోడు అయితే.. ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అందరికి తెలిసిందే. కారణం ఏమైనా కానీ తెలుగు సినిమా రంగానికి చుక్కలు చూపించే కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. అన్నింటికి మించి.. తనను విపరీతంగా అభిమానించే వారు సైతం.. గతంలో మాదిరి ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్ని దమ్ముగా మాట్లాడలేని పరిస్థితి.

సినిమా అన్నది వ్యాపారం. దాని మీద ఎవరికి ఎలాంటి సెంటిమెంట్లు ఉండవు. మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంటుంది. పైకి భావోద్వేగాలు కనిపించినా.. అవన్నీ కూడా వ్యూహాత్మకమే తప్పించి ఇంకేం కాదు. తాను సినిమా తీసే హీరో గురించి నిర్మాత పొగిడేస్తాడు. ఆయన గురించి హీరో ఆకాశానికి ఎత్తేసి మాట్లాడతారు. అంత కెమిస్ట్రీ ఉన్న వారిద్దరూ.. తమ తర్వాతి సినిమాను వేరే వారితో చేస్తారు. సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందనటానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.

అలాంటి ప్రపంచానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడో హర్ట్ అయ్యారు. ఏపీ సీఎంగా తనకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు తెలుగు సినీ పరిశ్రమ నుంచి తాను పొందలేకపోయానన్న భావన ఆయనకు ఉందన్నట్లుగా ఆయన్ను అమితంగా ఆరాధించే వారు సైతం వ్యాఖ్యానిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రిని గుర్తించినట్లుగా.. ఏపీ సీఎంను ఎందుకు గుర్తించరు? ఆయనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వనప్పుడు.. అందుకు తగ్గ శాస్తి జరగాల్సిందే అంటూ కొందరు వీరాభిమానుల మాటలు ఇప్పుడు అందరూ శ్రద్ధగా వింటున్నారు.

ఎందుకంటే.. ఏపీలో సినిమా థియేటర్ల వ్యవహారం అంతకంతకూ ముదిరిపోవటమే కాదు.. సినిమాకు ఆయువుపట్టుపై ఏపీ ప్రభుత్వం కొడుతున్న దెబ్బలకు హాహాకారాలు చేస్తున్నారు. విషయం ఎక్కడి వరకు వెళ్లిందంటే.. పదుల సంఖ్యలో సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసేసే పరిస్థితికి వెళ్లింది. రానున్న రోజుల్లో ఈ బాటలో నడిచే వారి సంఖ్య మరింత పెరగటం ఖాయమని చెబుతున్నారు. దేశంలో.. ఆ మాటకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా పెరిగే ధరలే కానీ.. ఎందులోనూ తగ్గే పరిస్థితి లేదు.

అలాంటప్పుడు వినోద కేంద్రంగా ఉండే సినిమా టికెట్ ధరను తగ్గించాలని ఎవరూ కోరుకోరు. అదే సమయంలో.. భారీగా పెరగటాన్ని హర్షించరు. అటు ప్రేక్షకుడికి.. ఇటు సినిమా నిర్మాతకు మధ్య ఓకే అనుకునే వరకు టికెట్ ధరల విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ.. ఎవరైనా అతి చేస్తే.. ఆ సినిమాకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రేక్షకుడికి తెలుసు కాబట్టి.. సినిమా టికెట్ విషయంలో ప్రభుత్వం మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొంటున్నాయి. టికెట్ల ధరల్ని భారీగా.. అది కూడా రోడ్డు పక్కన ఉండే టీ కొట్టు వ్యక్తి అమ్మే టీ ధర కంటే తక్కువగా సినిమా టికెట్ ధర ఉండటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

అడుక్కునే వాడికి సైతం ఐదు రూపాయిలు తక్కువ ఇస్తే.. మాటలు అనేసేందుకు కొందరు భిక్షగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అలాంటిది ఒక సినిమా టికెట్ ధర రూ.5 నిర్ణయించటం ఎంతవరకు సబబు? టికెట్ల ధరల తగ్గింపు విషయంలో వాదనలు వినిపిస్తున్న వారు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి కమ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తీసిన పాదయాత్ర మూవీ మొదటి షో.. మొదటి టికెట్ ను అమ్మిన వైనాన్ని వైసీపీ నేతలు గుర్తుకు తెచ్చుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజున పాదయాత్ర మొదటి టికెట్ ను రూ.4లక్షలకు కొనుగోలు చేయటాన్ని మర్చిపోకూడదు. మరి.. ఆ రోజున టికెట్ ధరను అంతలా ఎందుకు పెట్టి కొన్నారని ప్రశ్నించిన వారెవరు లేరు.

అలాంటిది ఇప్పుడు ఏపీ ప్రభుత్వ నేతలు పలువురు సినిమా టికెట్ల ధరల మీద భారీ ఎత్తున లెక్చర్లు ఇస్తుండటంతో పాట విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. సినిమా టికెట్ల ధరల్ని దారుణంగా తగ్గించటం ద్వారా ఏపీ ప్రభుత్వం సాధించేదేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం.. టాలీవుడ్ పరిశ్రమను ఇరుకున పడేయటంగా కొందరు చెబుతున్నారు. ఇక్కడే మరికొందరు ఒక ఆసక్తికర వాదనను వినిపిస్తున్నారు.

టికెట్ ధరను తగ్గించిన ప్రభుత్వం.. తాము వసూలు చేసే జీఎస్టీ ను అసలేమీ లేకుండా చేస్తే.. టికెట్ ధర మరింత తగ్గుతుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అనుసరిస్తున్న విధానంలో.. రూ.వంద లోపు టికెట్ అయితే 12 శాతం.. రూ.వందకు పైన వసూలు చేసే టికెట్ కు 18 శాతం జీఎస్టీ ఉంది. అంటే.. వంద రూపాయిలు పెట్టి ప్రేక్షకుడు టికెట్ కొనుగోలు చేస్తే.. రూ.18 కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది. ప్రేక్షకుడి మీద భారం తగ్గించటమే లక్ష్యమైనప్పుడు.. ఈ పన్నుపోటు నుంచి ప్రేక్షకుడ్ని బయటపడేయొచ్చు కదా? అన్న ప్రశ్న వస్తోంది. మరి.. దీనికి ఏపీ అధికారపక్ష నేతలు ఏమంటారో?