Begin typing your search above and press return to search.

హీరో విజ‌య్ ట్యాక్స్ కేసు.. వాస్త‌వంగా జ‌రిగింది ఇదీ!

By:  Tupaki Desk   |   16 July 2021 11:30 AM GMT
హీరో విజ‌య్ ట్యాక్స్ కేసు.. వాస్త‌వంగా జ‌రిగింది ఇదీ!
X
కోలీవుడ్ స్టార్ హీరో థ‌ళ‌ప‌తి విజ‌య్ త‌న రోల్స్ రాయీస్ కారుకు సంబంధించి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించ‌లేదంటూ.. మ‌ద్రాసు హైకోర్టు తీవ్ర‌ వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న చ‌ర్య రాజ‌ద్రోహ‌మేన‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు.. విజ‌య్ ను మందలిస్తూ ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా కూడా విధించింది. దీంతో.. కోలీవుడ్ వర్గాల్లో క‌ల‌క‌లం రేగింది. సోష‌ల్ మీడియాలో విజ‌య్ వ్య‌తిరేకులు ఓ రేంజ్ లో ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌య‌మై విజ‌య్ త‌ర‌పు నుంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ మేర‌కు విజ‌య్ న్యాయ‌వాది త‌మ వెర్ష‌న్ వినిపించారు.

విజ‌య్ లాయ‌ర్ కుమార‌స‌న్ ఓ త‌మిళ ప‌త్రిక‌తో ఈ విష‌య‌మై మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా తమ వాద‌న ఏంటీ? జ‌రుగుతున్న ప్ర‌చారం ఏంటీ అన్న‌దానిపై క్లారిటీ ఇచ్చారు. అస‌లు.. తాము దాఖ‌లు చేసిన కేసు ఏంట‌న్న‌ది కూడా చెప్పారు. దీనిక‌న్నా ముందు.. ఇలాంటి ఓ కేసును కూడా వివ‌రించారు. 199లో విలియమ్ ఫెర్నాడెజ్ అనే వ్య‌క్తి కేర‌ళ హైకోర్టులో ఎంట్రీ ట్యాక్స్ విష‌య‌మై కేసు పెట్టార‌ట‌. ఈ పిటిష‌న్లో విలియమ్ వాద‌న ఏమంటే.. ''మేము వాహనాన్ని దిగుమతి చేసుకున్నప్పుడు భారీగా దిగుమతి సుంకం చెల్లించాం. మళ్లీ ఎంట్రీ ట్యాక్స్ ఏంటీ? ఇది న్యాయం కాదు'' అని కేరళ హైకోర్టులో వాదించారు. ఈ కేసును విచారించిన న్యాయ‌స్థానం.. క‌స్ట‌మ్స్ ట్యాక్స్ చెల్లించిన త‌ర్వాత ఎంట్రీ ట్యాక్స్ వ‌ర్తించ‌ద‌ని తీర్పు చెప్పింద‌ట‌.

ఇప్పుడు విజ‌య్ కేసు కూడా అలాంటిదే. ఆయ‌న దిగుమ‌తి సుంకం మొత్తం చెల్లించారు. కానీ.. ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల‌ని కోర‌డంపై వివాదం నెల‌కొంద‌ని తెలిపారు. దీంతో.. 2012లో ఆ కారు కొనుగోలు చేసిన స‌మ‌యంలోనే ష‌ర‌తుల‌తో కూడిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను కోర్టు జారీచేసిందని, దీని ప్ర‌కారం.. 20శాతం ఎంట్రీ ట్యాక్స్ చెల్లించి వాహ‌నాన్ని రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చ‌ని కోర్టు తెలిపింద‌న్నారు. దీంతో.. విజ‌య్ ఆ మొత్తాన్ని చెల్లించిన త‌ర్వాత‌నే రిజిస్ట‌ర్ చేసుకొని కారును వినియోగించార‌ని కూడా తెలిపారు.

తాజా విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు ఇలా వ్యాఖ్యానించింద‌ని అన్నారు. ఈ విష‌యం పూర్తిగా తెలియ‌ని వారు విజ‌య్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, ఇది స‌రికాద‌ని అన్నారు. మొత్తం తెలుసుకున్న త‌ర్వాత‌నే మాట్లాడాల‌ని అన్నారు విజ‌య్ లాయ‌ర్‌. అయితే.. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపైనా అప్పీల్ చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు. అయితే.. అది ట్యాక్స్ విష‌య‌మై కాద‌న్నారు. న్యాయ‌స్థానం చేసిన క‌ఠినమైన వ్యాఖ్య‌లు స‌రికాద‌నే అప్పీల్ చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు.

కాగా.. ఈ కేసు విష‌యంలో మ‌ద్రాసు హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌జ‌లు చెల్లించే ప‌న్నుల‌తోనే పాఠ‌శాల‌లు, ఆసుప‌త్రుల్లో సేవ‌లు స‌హా.. సంక్షేమ ప‌థ‌కాల‌న్నీ కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. సినిమా న‌టులు నిజ‌మైన హీరోలుగా ఉండాలే త‌ప్ప‌.. రీల్ హీరోలుగా కాదంది. ఇలాంటి వారు ప‌న్నులు ఎగ్గొట్ట‌డం ఏ మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని చెప్పిన న్యాయ‌స్థానం.. ప‌న్ను ఎగ‌వేత అనేది రాజ‌ద్రోహ‌మ‌ని తేల్చి చెప్పారు. దిగుమ‌తి చేసుకున్న కారుకు సంబంధించిన ఎంట్రీ ట్యాక్సు రెండు వారాల్లోగా చెల్లించాల‌ని ఆదేశించింది. అంతేకాదు.. ఈ పిటిష‌న్ వేసినందుకు గానూ ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా కూడా విధించింది. మ‌రి, దీనిపై అప్పీల్ కు వెళ్ల‌నున్న నేప‌థ్యంలో ఏం జ‌ర‌గ‌నుంద‌నేది చూడాలి.