Begin typing your search above and press return to search.

'వరుడు కావలెను' ను ముగించేశారు..!

By:  Tupaki Desk   |   7 Aug 2021 9:46 AM GMT
వరుడు కావలెను ను ముగించేశారు..!
X
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఒకేసారి రెండు మూడు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో 'లక్ష్య' అనే స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ చివరి దశకు తీసుకొచ్చాడు. అలానే శౌర్య తన హోమ్ బ్యానర్ లో అనీష్ కృష్ణ తో చేస్తున్న #NS22 ప్రాజెక్ట్ షూట్ లో పాల్గొంటున్నాడు. ఇదే క్రమంలో తాజాగా ''వరుడు కావలెను'' సినిమాకు సంబంధించిన మొత్తం చిత్రీకరణ పూర్తి చేశాడు.

నాగ శౌర్య కథానాయకుడిగా తెలుగమ్మాయి రీతూ వర్మ కథానాయికగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ''వరుడు కావలెను''. ల‌క్ష్మీ సౌజ‌న్య ఈ చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా లొకేషన్ లో డైరెక్టర్ తో హీరోహీరోయిన్లు కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు.

'మీ హృదయాలను ప్రేమ మరియు భావోద్వేగాలతో నింపడానికి త్వరలోనే మీ సమీపంలోని థియేటర్‌లలోకి ''వరుడు కావలెను'' సినిమా వస్తోందని చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ 'దిగు దిగు నాగ' అనే ఫోక్ సాంగ్ అందించారు.

'వరుడు కావలెను' చిత్రానికి వంశీ పచ్చిపులుసుల - విష్ణు శర్మ కలిసి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నదియా - మురళీశర్మ - వెన్నెల కిశోర్ - ప్రవీణ్ - హర్ష వర్ధన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.