Begin typing your search above and press return to search.

కమెడియన్ సునీల్ పై హీరో షాకింగ్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   25 July 2019 11:30 AM GMT
కమెడియన్ సునీల్ పై హీరో షాకింగ్ కామెంట్స్!
X
హీరో ఆకాష్ ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యాడు కానీ 'ఆనందం' టైమ్ లో మంచి మార్కెట్ ఉండేది. ఈమధ్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' కథను తన సినిమానుండి కాపీ కొట్టారని ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. రీసెంట్ గా మరో వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కమెడియన్ కం హీరో సునీల్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఆకాష్ హీరోగా నటించిన 'పిలిస్తే పలుకుతా' చిత్రంలో సునీల్ కమెడియన్ పాత్ర పోషించాడు. ఆ పరిచయంతో సునీల్ కు హీరోగా 'అందాల రాముడు' ఛాన్స్ వచ్చిన సమయంలో ఆకాష్ కు ఫోన్ చేసి "భయ్యా నేను సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో హీరోగా చేస్తున్నాను. తమిళ సినిమా 'సుందర భూషణ్' రీమేక్. మీరు ఒక క్యామియో చేయాలి" అని రిక్వెస్ట్ చేశాడట. "భయ్యా నువ్వు నా సినిమాలో క్యామియో చేస్తానని మాట ఇచ్చావు. నువ్వు తప్పకుండా చేయాలి" అని అడిగాడట. "ఆ సినిమాలో నువ్వు చెప్పిన పాత్ర అంతగా బాగుండదు కదా?" అని అనుమానం వ్యక్తం చేస్తే "ఆ క్యారెక్టర్ ను డెవలప్ చేయిస్తాను" అని మాటిచ్చాడట. దీంతో ఆకాష్ తనకు హీరోగా ఒక సినిమా అవకాశాన్ని వదులుకుని మరీ 'అందాల రాముడు' లో సెకండ్ హీరో పాత్రకు ఒప్పుకున్నాడట.

షూటింగ్ జరిగిన సమయంలో ఆకాష్ దగ్గరకు రోజూ సునీల్ వచ్చి చేతులు పట్టుకుని "ఇవి కాళ్ళు అనుకో భయ్యా.. నువ్వు చేసిన సాయం లైఫ్ లో మర్చిపోలేను" అనేవాడట. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఒక్క పోస్టర్ లో కూడా తన ఫోటో లేదని.. ఒరిజినల్ వెర్షన్ లో తన పాత్రకు ఒక పాట ఉంటే దాన్ని కూడా కట్ చేయించాడని తెలిపాడు. కనీసం సినిమా ప్రమోషన్స్ లో.. ఈవెంట్స్ లో తన పేరు ఒక్కసారి కూడా చెప్పలేదని అన్నాడు. సునీల్ తీరుతో హర్ట్ అయ్యానని తెలిపాడు. సునీల్ కు కృతజ్ఞత లేదని అన్నాడు.

అంతే కాదు సునీల్ తో కలిసి 'నవ వసంతం' సినిమా చేసే సమయంలో తనను చిన్నచూపు చేశాడని అన్నాడు. అప్పటివరకూ 'భయ్యా భయ్యా' అని పిలిచేవాడు కొత్తగా 'ఏ ఆకాష్' అని పిలవడం మొదలుపెట్టాడట. మరో సందర్భంలో హిందీ లో సూపర్ హిట్ అయిన 'పార్ట్నర్' సినిమాను తెలుగులో చేద్దామనే ఆలోచనతో ఆకాష్ సునీల్ ను కలిశాడట. "సునీల్ మనిద్దరం ఈ సినిమాను కలిసి చేద్దామా" అని అడిగితే చేయను అని చెప్పాడట. సునీల్ నిజ స్వరూపం ఇది అని తెలిసిన తర్వాత చాలా హర్ట్ అయ్యానని ఆకాష్ వెల్లడించాడు.