Begin typing your search above and press return to search.

లాకప్ సీజన్ 1 విజేత అతడే.. ప్రైజ్ మనీ ఇంతేనా?

By:  Tupaki Desk   |   9 May 2022 5:30 AM GMT
లాకప్ సీజన్ 1 విజేత అతడే.. ప్రైజ్ మనీ ఇంతేనా?
X
దేశీయంగా తిరుగులేని రియాల్టీ షోగా మారిన బిగ్ బాస్ క్రేజ్ కు బ్రేకులు వేసేందుకు వీలుగా సంచలన నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన లాకప్ సీజన్ 1 ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ షోకు సంచలనాల నటి కంగనా రౌనత్ హోస్టుగా వ్యవహరించటంతో ఈ షోకు ఆదరణ పెరగటమే కాదు.. ఇందులోని కాన్సెప్టు అందరిని ఆకర్షించింది. ఈ రియాల్టీ షోను టీవీ చానల్ లో కాకుండా కేవలం ఓటీటీ ప్లాట్ పాం మీదనే టెలికాస్టు చేయటం తెలిసిందే. అలా చేస్తేనే దీనికి బోలెడంత ప్రేక్షక ఆదరణ లభించటం గమనార్హం.

వివాదాస్పద అంశాలు.. సంచలనాలతో ఉండే ఈ షో కాన్సెప్టు ఇప్పటివరకు వచ్చిన వాటికి భిన్నంగా ఉండటంతో మీడియాలోనూ ఈ షోకు సంబంధించిన వార్తలు హోరెత్తాయి. దీంతో.. ఈ షో మీద ఆసక్తి పెరిగేలా చేసింది. సీజన్ 1లో మొత్తం 20 మంది వివాదాస్పద.. సంచలనాల సెలబ్రిటీలను ఎంపిక చేయటం తెలిసిందే. సీజన్ 1 విజేతగా వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావరర్ ఫారూఖీ విజేతగా నిలిచారు.

ప్రైజ్ మనీ కింద అతడి దక్కింది రూ.20లక్షలు మాత్రమే. కాకుంటే.. ఫారిన్ టూర్ తో పాటు పలు ప్రోత్సహాకాల్ని ప్రకటించారు. అయితే.. ఈ షోకు హోస్టుగా వ్యవహరించిన కంగనా రౌనత్ కు మాత్రం భారీ మొత్తంలో ఏక్తాకపూర్ ముట్టజెప్పినట్లుగా చెబుతున్నారు.

తొలి వారం నుంచే లాకప్ షోకు ప్రేక్షకదరణ పెరిగింది. దీనికి తోడు కంగనా తీరు రేటింగ్స్ మరింత పెరగటానికి కారణమైంది. తొలివారం నుంచి అందరి చూపు లాకప్ మీద పడేలా చేయటంలో కంగనా సక్సెస్ అయ్యారు. ఈ షోకు ఎంతటి ప్రేక్షక ఆదరణ అంటే.. షో చివరి వారాన్ని ఏకంగా 300 మిలియన్ల మంది చూసినట్లుగా చెబుతున్నారు. శనివారం రాత్రి ముగిసిన గ్రాండ్ ఫినాలే లో విన్నర్ గా మునావర్ ఫారూఖీ.. రన్నర్ గా నటి, మోడల్ పాయల్ రోహత్గీ నిలిచింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వ్యక్తిగతంగా చూస్తే కంగనా మోడీ పరివారానికి తన ఫుల్ సపోర్టు ఇస్తుంటారు. కానీ.. ఆమె ప్రయోక్తగా వ్యవహరించిన లాకప్ షోలో విజేత మాత్రం.. మోడీ- బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయటమే కాదు.. కేసుల మీద పడి.. జైలుకు వెళ్లి వచ్చిన మునావర్ విజేతగా నిలవటం విశేషంగా చెప్పాలి.

ఇందులో పాల్గొన్న 20 మంది సెలబ్రిటీలు తమ టాస్కుల్లో భాగంగా ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలియని ఎన్నో సీక్రెట్లను బయటపెట్టారు. ఇవన్నీ పెను సంచలనాలకు దారి తీశాయి. ఇందులో కొన్ని అంశాలైతే జీర్ణించుకోలేనట్లుగా ఉండటం గమనార్హం. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ రియాల్టీ షోను అల్ట్ బాలాజీ.. ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ ప్లాట్ పాం మీద ప్రసారం చేసినప్పటికీ.. సీజన్ 2ను మాత్రం టీవీ చానల్ లో టెలికాస్టు చేసే ఆలోచనలో ఆమె ఉన్నారు. ఇప్పటికైతే హిందీలో మాత్రమే ఉన్న ఈ రియాల్టీ షోను.. రానున్న రోజుల్లో వివిధ భాషల్లో కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. ప్రతి సీజన్ లోనూ సెలబ్రిటీలకు సంబంధించి సీక్రెట్ లైఫ్ కు సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు రానున్నాయన్న మాట.