Begin typing your search above and press return to search.

చిరంజీవి గారన్న ఆ ఒక్క మాట చాలు: సందీప్ కిషన్

By:  Tupaki Desk   |   16 Sep 2021 4:31 AM GMT
చిరంజీవి గారన్న ఆ ఒక్క మాట చాలు: సందీప్ కిషన్
X
సందీప్ కిషన్ హీరోగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 'గల్లీ రౌడీ' సినిమా రూపొందింది. 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' హిట్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమైన సినిమా ఇది. నేహా శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా బాబీ సింహా కనిపించనున్నాడు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేదికపై సందీప్ కిషన్ మాట్లాడాడు.

'A 1 ఎక్స్ ప్రెస్' తరువాత ఒక మంచి కమర్షియల్ ఫన్నీ ఎంటర్టైనర్ చేయాలి అనుకున్నాను. ఎక్కవ ఆలోచించే సినిమా కాకుండా సరదాగా నవ్వుకునే సినిమా చేయాలి అనుకున్నాను. అలాంటి సమయంలో భాను - సాయి నాకు ఈ కథ చెప్పారు. ఆ కథ నాకు బాగా నచ్చింది. నాగేశ్వర రెడ్డి గారి దగరికి వాళ్లను పంపించాను. కథ వినగానే 'చాలా బాగుంది .. చేద్దాం' అని ఆయన అన్నారు. సాధారణంగా మేము అంత కష్టపడ్డాం ,.. ఇంత కష్టపడ్డాం అని చాలామంది చెబుతూ ఉంటారు. నిజానికి ఈ సినిమా కోసం మేము ఎంతమాత్రం కష్టపడలేదు.

మా పాత్రలను ఎంజాయ్ చేస్తూ .. చాలా సరదాగా ఈ సినిమాను పూర్తి చేశాము. ఎవరూ ఏ విషయంలోను టెన్షన్ పడకుండా ఈ సినిమాకి పనిచేశారు. ఎవరికి ఇచ్చిన పాత్రను వాళ్లు బాగా చేశారు. ఒక క్రైమ్ కామెడీకి కాస్త మసాలా జోడించి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా తీస్తే ఎలా ఉంటుందనే ఒక ప్రయత్నం చేశాము. నేహా శెట్టి కూడా చాలా బాగా చేసింది .. కామెడీ టైమింగ్ తో చేయడం గొప్ప విషయం. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లంతా పనికి విలువ ఇచ్చేవాళ్లు కావడం విశేషం. అలాంటివారు దొరకడం మా అదృష్టంగానే భావిస్తున్నాము.

ఈ రోజుల్లో ఒక సినిమా విజయాన్ని దేనితో కొలిచే పరిస్థితి లేదు. చూసిన ప్రేక్షకులందరికే సినిమా నచ్చిందంటే అది విజయం కిందే లెక్క. చిరంజీవిగారు సినిమా ట్రైలర్ చూసి ''సందీప్ నీకు ఇలాంటి పాత్రలు బాగుంటాయి. ఇలాంటి పాత్రలు నీకు సెట్ అవుతాయి" అన్నారు. అంటే అంతకుముందు ఆయన నా వర్క్ చూశారన్న మాట. ఆయనన్న ఆ ఒక్క మాట చాలు .. ఆ మాటతో 'గల్లీ రౌడీ'కి అతి పెద్ద విజయాన్ని సాధించినట్టుగా నేను భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.