Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ రాలేక పోయినా కాల్‌ చేశాడట

By:  Tupaki Desk   |   9 Sep 2021 9:30 AM GMT
ప్రభాస్‌ రాలేక పోయినా కాల్‌ చేశాడట
X
గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందిన సిటీమార్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. వినాయక చవితి సందర్బంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్‌ పాల్గొనబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని ప్రభాస్ ముంబయిలో షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ కారణంగా ప్రభాస్ సిటీమార్ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనలేక పోయాడు. గోపీచంద్‌ మరియు ప్రభాస్‌ లు మంచి స్నేహితులు అనే విషయం తెల్సిందే. వీరిద్దరు వర్షం సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత పలు సందర్బాల్లో కూడా వీరిద్దరు కలిశారు. గోపీచంద్ కోసం ప్రభాస్ పలు సార్లు వచ్చాడు. ఇద్దరు పలు వేదికలపై కలిసి కనిపించారు. మళ్లీ సిటీమార్‌ కోసం వీరు వస్తారని అంతా ఆశించారు కాని నిరాశ తప్పలేదు.

సిటీమార్ ప్రీ రిలీజ్ వేదిక పై గోపీచంద్ మాట్లాడుతూ ప్రభాస్ ను గుర్తు చేసుకున్నాడు. నా మిత్రుడు రాలేక పోయినా ట్రైలర్ చూసి బాగుందని చెప్పాడు. ఆ ఫ్రెండ్‌ ఎవరో మీకు అర్థం అయ్యి ఉంటుంది అంటూ గోపీచంద్‌ అన్న వెంటనే ప్రభాస్ అంటూ గట్టిగా అరిచారు. ప్రభాస్ రాకపోయినా కూడా అతడి శుభాకాంక్షలు సిటీమార్ కు దక్కడం ఆనందంగా ఉంది అన్నట్లుగా గోపీచంద్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ముంబయిలో ఉన్న ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమా చిత్రీకరణ లో పాల్గొంటున్నాడు అనేది సమాచారం. ఇక గోపీచంద్ సిటీమార్ సినిమా కు తర్వాత అయినా ప్రభాస్ డైరెక్ట్‌ గా శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం ఉందని అంటున్నారు.

కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే సిటీమార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కబడ్డీ ఆట తో సాగింది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా రేపు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. గోపీచంద్‌ మరియు తమన్నాలు ఇద్దరు కూడా అమ్మాయిల జట్ల కోచ్ లుగా కనిపించబోతున్నారు. ఇద్దరికి ఇద్దరు కూడా కబడ్డీ కోసం చాలా కష్టపడ్డారట. ఈ విషయాన్ని గోపీచంద్‌ మరియు ఇతర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. సోషల్‌ మీడియాలో ఈ సినిమా పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. కబడ్డీ ఆటను ఇష్టపడేవారు మాత్రమే కాకుండా పక్కా కమర్షియల్‌ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా వింధు భోజనం అంటూ యూనిట్ సభ్యులు ధీమాగా చెబుతున్నారు.