Begin typing your search above and press return to search.

మెగా హీరో మూవీకి పోటీగా గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్'

By:  Tupaki Desk   |   2 Oct 2021 8:41 AM GMT
మెగా హీరో మూవీకి పోటీగా గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్
X
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ - నయనతార జంటగా నటించిన సినిమా ''ఆరడుగుల బుల్లెట్''. మాస్ డైరెక్టర్ బి. గోపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేష్ ఈ సినిమాని నిర్మించారు. 2017 జూలై లోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో రెండు మూడు సార్లు విడుదల చేయాలనుకున్నా ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత ఈ సినిమా విడుదలకు నోచుకుంటోంది.

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ''ఆరడుగుల బుల్లెట్'' చిత్రాన్ని అక్టోబర్ 8న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గోపీచంద్ ను మాస్ అవతారంలో చూపిస్తూ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన 'సీటీమార్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'ఆరడుగుల బుల్లెట్' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

'ఆరడుగుల బుల్లెట్' చిత్రంలో ప్రకాష్ రాజ్ - అభిమన్యు సింగ్ - కోట శ్రీనివాసరావు - బ్రహ్మానందం - జయ ప్రకాష్ రెడ్డి - చలపతిరావు తదితరులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. బాల మురుగన్ సినిమాటోగ్రఫీ అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేశారు. దర్శక రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే అందించగా.. అబ్బూరి రవి సంభాషణలు రాశారు.

'సీటీమార్' చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన హీరో గోపీచంద్ మాస్ ఇమేజ్.. మాస్ ఆడియన్స్ లో దర్శకుడు బి. గోపాల్ కు ఉండే క్రేజ్.. నయనతార గ్లామర్.. మణిశర్మ మ్యూజిక్ 'ఆరడుగుల బుల్లెట్' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అక్టోబర్ 8న విడుదల అవుతున్న 'కొండ పొలం' సినిమాతో పోటీగా నిలబడి ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.