Begin typing your search above and press return to search.

గీతా ఆర్ట్స్ వారి మలయాళ రీమేక్ అటకెక్కిందా..?

By:  Tupaki Desk   |   16 Dec 2021 12:30 AM GMT
గీతా ఆర్ట్స్ వారి మలయాళ రీమేక్ అటకెక్కిందా..?
X
మలయాళంలో విమర్శకుల ప్రశంసలు పొందిన సూపర్ హిట్ ''నాయట్టు'' సినిమాను గీతా ఆర్ట్స్ వారు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఇటీవలే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అయితే త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనుకుంటుండగా.. ఇప్పుడు ఈ రీమేక్ పనులు ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - విద్యా మాధురి ఈ రీమేక్ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులో అంజలి - ప్రియదర్శి - రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు వెల్లడించారు. మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ - ఎడిటర్ నవీన్ నూలి - సినిమాటోగ్రాఫర్ అరుళ్ విన్సెన్ట్ వంటి టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాలో భాగం అవుతున్నట్లు పేర్కొన్నారు.

అయితే రీమేక్ హక్కుల విష‌యంలో గీతా ఆర్ట్స్‌ కి మ‌లయాళ‌ నిర్మాత‌ల‌కూ మ‌ధ్య విభేదాలు రావడంతో 'నాయ‌ట్టు' రీమేక్ ను ప‌క్క‌న పెట్టేశార‌ని టాక్‌ నడుస్తోంది. దీంతో ఇప్పటికే రీమేక్ స్క్రిప్ట్ ని రెడీ చేసిన డైరెక్టర్ క‌రుణ కుమార్ తదుపరి సినిమా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఒకవేళ రీమేక్ రైట్స్ విషయంలో సమస్యలు తొలగిపోయినా గీతా వారు ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.

'నాయట్టు' చిత్రంలో నాయకులు తమ స్వార్ధ రాజకీయాల కోసం వ్యవస్థలను, అధికారాన్ని చేతిలో పెట్టుకుని సామాన్యులను ఎలాంటి వేధింపులకు గురి చేస్తారు.. పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి సొంత పోలీసులను ఎలా బలిపశువులను చేశారనే అంశాలను చూపించారు. వాస్తవికతకు దగ్గరగా మంచి కాన్సెప్ట్ తో ఉండే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి కనబరిచారు.

కానీ ఇప్పుడేమో అసలు ఈ రీమేక్ మీద నిర్మాతలు ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేదని టాక్ వచ్చింది. ఇదే కనుక నిజమైతే, రీమేక్ హ‌క్కులు చేతులు మారి మళ్ళీ ఈ సినిమా మొదలవుతుందేమో చూడాలి.