Begin typing your search above and press return to search.

ఒకటే కథ.. నలుగురు రాణులు

By:  Tupaki Desk   |   7 Sep 2017 5:08 AM GMT
ఒకటే కథ.. నలుగురు రాణులు
X
ఈమధ్య కాలంలో సౌత్ సినిమాలపై బాలీవుడ్ బాగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ హిట్టయిన కథాంశాలతో హిందీలో తెగ సినిమాలు తీసేస్తున్నారు. కానీ అదేంటో హిందీలో హిట్టయిన కథలపై సౌత్ దర్శక నిర్మాతలు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. దానికి భిన్నంగా ఒక్క సినిమా విషయంలో మాత్రం రీమేక్ చేయాలని తెగ ఆరాటపడుతూ వస్తున్నారు. అదే కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన క్వీన్.

వికాస్ భల్ డైరెక్షన్ లో వచ్చిన క్వీన్ సినిమా మూడేళ్ల క్రితమే హిందీలో విడుదలైంది. అప్పటి నుంచి ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తమిళానికి సంబంధించి హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ రైట్స్ దక్కించుకున్నారు. కాకుంటే హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో సినిమా పట్టాలెక్కలేదు. దీనిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. క్వీన్ తమిళ్ వెర్షన్ లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇదే సినిమాను తెలుగులో మిల్కీ బ్యూటీ తమన్నా చేయబోతోంది. ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మిస్సమ్మ ఫేం నీలకంఠ డైరెక్ట్ చేయబోతున్నాడు. తెలుగు వెర్షన్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో నీలకంఠ బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన వెంటనే సినిమా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తమన్నా - కాజల్ ఇద్దరూ తెలుగు - తమిళ్ రెండు భాషల్లోనూ బాగా ఫేమస్ అయిన హీరోయిన్లే. అయినా ఒక్కో భాషకు ఫిలిం మేకర్స్ వేరువేరుగా హీరోయిన్లను ఎంచుకోవడం విశేషం. అన్నట్టు ఈ సినిమాను కన్నడలోనూ రీమేక్ చేస్తున్నారు. ఆ భాషలో శాండల్ వుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన పారుల్ యాదవ్ నటిస్తోంది. రమేష్ అరవింద్ ఆ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక మలయాళం వర్షన్ లో తీసే క్వీన్ కు.. ముందులో అమలా పాల్ ను అనుకున్నారు కాని.. ఇప్పుడు మాత్రం సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఫేం మంజిమా మోహన్ పేరు వినిపిస్తోంది. సో.. సౌత్ లో ఒకేసారి మూడు భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతోందన్న మాట.