Begin typing your search above and press return to search.

సంక్రాంతి లక్ష్యంగా పరుగులు తీస్తున్న చిత్ర బృందాలు..!

By:  Tupaki Desk   |   21 Nov 2022 1:30 PM GMT
సంక్రాంతి లక్ష్యంగా పరుగులు తీస్తున్న చిత్ర బృందాలు..!
X
2023 సంక్రాంతి సినిమాల మీద ఓ క్లారిటీ వచ్చేసింది. 'ఆది పురుష్' రేసులో నుంచి తప్పుకోవడం.. 'ఏజెంట్' చిత్రం వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఫైనల్ గా బాక్సాఫీస్ వార్ లో నాలుగు సినిమాలు నిలవనున్నాయి. అందులో రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలైతే.. మిగతా రెండు తమిళ డబ్బింగ్ చిత్రాలు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' - నటసింహ నందమూరి బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి' సినిమాలు పెద్ద పండక్కి రిలీజ్ కాబోతున్నాయి. అలానే కోలీవుడ్ హీరోలు విజయ్ నటిస్తున్న 'వారసుడు' మరియు అజిత్ కుమార్ 'తునివు' చిత్రాలను పొంగల్ కి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నాలుగు చిత్రాలను వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు కానీ.. ఇంతవరకూ కచ్చితమైన విడుదల తేదీలను వెల్లడించలేదు. పండుగకు గట్టిగా 50 రోజులు కూడా లేదు. ఇంకా సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అవ్వలేదు. మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.

కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వాల్తేరు వీరయ్య' సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అలానే గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతున్న 'వీర సింహారెడ్డి' మూవీ షూటింగ్ కూడా ఫైనల్ స్టేజీలో ఉంది. బాలయ్య మరియు హీరోయిన్ శృతి హాసన్ లపై ఓ సాంగ్ ని డిసెంబర్ రెండో వారం తర్వాత చిత్రీకరించనున్నారు.

వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టి సారించాలని రెండు చిత్ర బృందాలు విరామం లేకుండా పని చేస్తున్నాయి. మరోవైపు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న 'వారసుడు' మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. డిసెంబర్ నాటికి ఈ షెడ్యూల్ ని ముగించి మిగిలిన ప్యాచ్‌ వర్క్ పూర్తి చేయాలని చూస్తున్నారు.

హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న 'తునివు' సినిమా షూటింగ్ కూడా పెండింగ్ ఉంది. వచ్చే షెడ్యూల్ లో ఓ పాటని చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్యాచ్ వర్క్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ లోకి వెళ్లాలని అనుకుంటున్నారు.

సంక్రాంతి కోసం ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన టీమ్స్ నిర్విరామంగా పని చేస్తున్నాయి. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో టార్గెట్ ని రీచ్ అవ్వడానికి పరుగులు తీస్తున్నారు. వీలైనంత త్వరగా అన్ని పనులు పూర్తి చేసి.. డిసెంబర్‌ లో దూకుడుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు థియేటర్ల కేటాయింపులో వివాదం నెలకొంది. ఫెస్టివల్ సీజన్స్ లో స్ట్రెయిట్ తెలుగు చిత్రాలను ప్రాధాన్యం ఇవ్వాలని నిర్మాతల మండలి పేర్కొనగా.. తమిళ్ డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని కోలీవుడ్ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు సినిమాలకు తమిళనాట ఇదే విధంగా ప్రాధానత్య ఇస్తారా? అని టాలీవుడ్ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ డబ్బింగ్ చిత్రాలను ఎవరూ అడ్డుకోవడం లేదని.. మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మాత్రమే చెబుతున్నారని అంటున్నారు. టాక్ బాగుంటే రాబోయే రోజుల్లో ఆటోమేటిక్ గా స్క్రీన్స్ పెంచుకోవచ్చని పేర్కొంటున్నారు.

అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రెండు తెలుగు సినిమాలు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్న డబ్బింగ్ చిత్రాలు బరిలో ఉండటంతో వేటికి ఎక్కువ థియేటర్లు ఇస్తారనేది టాపిక్ అయింది. మరి ఈ వివాదానికి ఇండస్ట్రీ పెద్దలు ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.