Begin typing your search above and press return to search.

'రాధే శ్యామ్' మేకర్స్ పై కేసు పెట్టమని సూచించిన పోలీసులు..!

By:  Tupaki Desk   |   16 Nov 2021 9:14 AM GMT
రాధే శ్యామ్ మేకర్స్ పై కేసు పెట్టమని సూచించిన పోలీసులు..!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమా సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ వారు ఆలసత్వం వహిస్తున్నారంటూ డార్లింగ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. యూవీ పేరెత్తితేనే విరుచుకుపడుతున్నారు.

'రాధే శ్యామ్' సినిమా నుంచి సకాలంలో అప్డేట్స్ రాకపోవడం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ పై ఎప్పటి నుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ఆకాంక్ష‌లు యూవీ టీమ్ కు ప‌ట్ట‌వ‌ని తీవ్ర స్థాయిలో మండిపడుతూ వచ్చారు. ఇప్పుడు విడుదల తేదీ దగ్గరపడుతున్నా ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేయడం లేదంటూ ట్రోల్స్ చేయడమే కాకుండా.. ట్విట్టర్ లో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేశారు.

ఈ క్రమంలో యూవీ ఆఫీస్ వద్ద ఆందోళ‌న చేయడం కూడా జరిగింది. అంతేకాదు ఓ అభిమాని ఏకంగా తన చావుకు దర్శకనిర్మాతలు కారణమంటూ సూసైడ్ లెటర్ కూడా రాశాడు. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఈసారి కూడా ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ మీద యూవీ టీమ్ నీళ్లు చల్లింది. తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ తెచ్చుకున్న లిరికల్ సాంగ్ గా రికార్డ్ క్రియేట్ తెచ్చి పెట్టాలనుకున్న వారి ప్లాన్స్ కు బ్రేక్ పడింది.

'ఈ రాతలే' పాట సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు పాట విడుదల చేస్తామని మేకర్స్ ముందుగా ప్రకటించారు. కానీ చెప్పిన సమయానికి సాంగ్ రాలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కాస్త ఆలస్యమవుతోందనే కారణాన్ని వెల్లడించారు. రాత్రి 8 గంటలకు పాట రిలీజ్ అవుతుందని పేర్కొనగా.. టైం తొమ్మిది అయినా సాంగ్ బయటకు రాలేదు. చివరకు యూట్యూబ్‌ లో రాధే శ్యామ్ పాటని అప్లోడ్ చేసిన మేకర్స్.. వేరే ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి పోస్ట్ చేశారు. ఈ తతంగం అంతా డార్లింగ్ ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచేలా చేసింది.

ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ వారిని 'రాధే శ్యామ్' దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ను బండ బూతులు తిడుతూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. 'సాహో' నుంచీ ఇలానే ఫ్యాన్స్ తో ఆడుకుంటున్నారని ట్రోల్ చేశారు. మీరు ఇంక మారరా అంటూ మీమ్స్ తో విరుచుకుపడ్డారు. ఈ క్ర‌మంలో ప్రభాస్ అభిమాని ఒకరు త‌మ మ‌నోభావాల‌తో ఆడుకుంటున్న యూవీ టీమ్ ని అరెస్ట్ చేయ‌మ‌ని కోరుతూ హైద‌రాబాద్ పోలీసులను ట్విట్ట‌ర్ వేదికగా కోరాడు.

సమస్య ఏదైనా వెంటనే స్పందించే పోలీసులు.. దీనికి రిప్లై ఇస్తూ దగ్గరలోని పోలీస్ స్టేష‌న్‌ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా అభిమానికి సూచించారు. అధికారిక పోలీస్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఈ ట్వీట్‌ ను అభిమానులు వైర‌ల్ చేశారు. మరి రాబోయే రోజుల్లో అయినా 'రాధే శ్యామ్' మేకర్స్ సరైన సమయానికి అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని శాంతింపజేస్తారేమో చూడాలి.