Begin typing your search above and press return to search.

నాగ్ మీద గుర్రుగా ఉన్న ఎగ్జిబిటర్లు..?

By:  Tupaki Desk   |   7 Jan 2022 8:30 AM GMT
నాగ్ మీద గుర్రుగా ఉన్న ఎగ్జిబిటర్లు..?
X
'బంగార్రాజు' వేదిక మీద కింగ్ అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినిమా టికెట్ రేట్స్ త‌గ్గించ‌డంపై మీడియా ప్ర‌శ్నించిన‌ప్పుడు నాగ్ మాట్లాడుతూ.. ''సినిమా స్టేజ్‌ మీద రాజ‌కీయాలు మాట్లాడకూడదు.. నేను మాట్లాడ‌ను.. ఏపీలో టికెట్ ధరలతో నా సినిమాకు ఇబ్బంది ఏమీ లేదు'' అని అన్నారు. ఈ కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.

సినిమా వేదిక మీద రాజ‌కీయాలు మాట్లాడకూడదు అనే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవే అని అభిమానులు ట్విట్టర్ లో నాగార్జునను ట్రోల్ చేసారు. గతంలో 'రగడ' ఆడియో ఫంక్షన్ లో సినిమా స్టేజీ మీద పైరసీ గురించి నాగ్ చేసిన ప్రసంగాన్ని బయటకు తీసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో రాజ‌కీయాలు మాట్లాడ‌ను అన‌డం వ‌ర‌కు ఓకే కానీ.. తన సినిమాకు ఏపీలో వ‌చ్చిన ఇబ్బందేమీ లేదన‌డం పలువురు ఎగ్జిబిటర్లకు ఇబ్బందిగా అనిపించినట్లు టాక్ నడుస్తోంది.

నాగార్జున ఇండ‌స్ట్రీకి అనుకూలంగా మాట్లాడ‌క‌పోయినా పర్వాలేదు కానీ.. మిగతా సినిమాల గురించి ఆలోచించకుండా ఇలా తన సినిమాకు ఇబ్బంది లేదని మాట్లాడటం ఏంటని ఏపీలోని కొందరు ఎగ్జిబిట‌ర్స్ గుర్రుగా ఉన్నారట. ఇప్పటికే ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు ఈ విషయం మీద రాజ‌మండ్రిలో సమావేశమై నాగ్ వ్యాఖ్యలను ఖండించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు మరో రెండు రోజుల్లో మళ్ళీ మీటింగ్ పెట్టి ఈ విషయం మీద చర్చించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమా టికెట్ రేట్ల అంశంపై నాగార్జున తన అభిప్రాయాలను మరింత క్లారిటీగా చెప్పాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారట. నాగ్ స్పందనను బట్టి దీనిపై నిరసన తెలపాలని యోచిస్తున్నారట. అక్కినేని హీరోలు నటించిన 'బంగార్రాజు' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఆలోపే దీనిపై నాగార్జున వివరణ ఇస్తారని అందరూ భావిస్తున్నారు.

వైఎస్ ఫ్యామిలీతో నాగార్జున‌కు మధ్య సాన్నిహిత్యం ఉందనే సంగతి అంద‌రికీ తెలిసిందే. అందులోనూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 'బంగార్రాజు' డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సోదరుడు కన్నబాబు కురసాల ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. వ్య‌క్తిగ‌తం వారి మధ్య సన్నిహిత సంభందాలు ఉన్నా.. సినిమా ఇండ‌స్ట్రీ విష‌యానికి వ‌చ్చేసరికి అది వేరుగా ఉండాలనేది సినీ అభిమానుల అభిప్రాయం.

అంతేకాదు అక్కినేని నాగార్జున‌ ముప్పై ఏళ్లకు పైగా టాలీవుడ్ కు సేవలు అందిస్తున్నారు. ప్రొడ్యూసర్ గా సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు నిర్ణయం పెద్ద సినిమాలకు ఇబ్బంది అని సినీ ప్రముఖులు అంటున్నారు. మరి దీనిపై నాగ్ మరోసారి వివరంగా మాట్లాడి అందరికీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.