Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ క‌ల‌క‌లంః : రానా విదేశీ పార్సిల్‌ త‌నిఖీ ?

By:  Tupaki Desk   |   2 Aug 2017 4:18 PM GMT
డ్ర‌గ్స్ క‌ల‌క‌లంః : రానా విదేశీ పార్సిల్‌ త‌నిఖీ ?
X
హైద‌రాబాద్ లో క‌ల‌కలం రేపిన డ్రగ్స్ వ్యవహారంలో ఆన్ లైన్ పార్శిళ్ల పాత్ర కీల‌కంగా మారిన సంగ‌తి తెలిసిందే. డార్క్ వెబ్ ద్వారా విదేశాల నుంచి కొనుగోలు చేసిన డ్ర‌గ్స్ చేసి హైద‌రాబాద్ కు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఇటీవల పూర్త‌యిన సిట్ విచార‌ణ‌లో ఈ ఆన్‌లైన్ పార్శిళ్ల గురించిన స‌మాచారం వెల్ల‌డైంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వస్తున్న పార్శిళ్లపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘా పెంచారు. ఈ క్రమంలో హైదారాబాద్ లోని రామానాయుడు స్టూడియోకు విదేశాల నుంచి పార్శిల్ వ‌చ్చిన‌ట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ పోలీసులు మూడు గంటల పాటు స్టూడియోలో సోదాలు నిర్వహించారు.

ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ కనకదుర్గ ఆధ్వర్యంలో పది మంది అధికారులు ఈ త‌నిఖీల్లో పాల్గొన్నారు. రామానాయుడు స్టూడియోకు విదేశాల నుంచి ఓ పార్శిల్‌ వచ్చినట్లు తమకు సమాచారం అందడంతో త‌నిఖీలు చేప‌ట్టామ‌ని కనకదుర్గ వెల్లడించారు. కొందరు విదేశాల నుంచి నేరుగా ఆన్‌లైన్‌ నుంచి డ్రగ్స్‌ తెప్పించుకుంటున్నట్లు తేలడంతో ఈ సోదాలు నిర్వ‌హించిన‌ట్లు ఆమె తెలిపారు. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతుంద‌ని, ఈ నేప‌థ్యంలో అనుమానం ఉన్న ప్ర‌తి వ‌స్తువు, అంశంపై అల‌ర్ట్ గా ఉంటున్నామ‌ని చెప్పారు.

మ‌రోవైపు తమకు విదేశాల నుంచి పార్శిల్ వచ్చింద‌ని సినీ నిర్మాత దగ్గుబాట సురేష్‌బాబు తెలిపారు. త‌న కుమారుడు హీరో రాణా వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్నాడ‌ని, దాని నివారణ కోసం విదేశాల నుంచి ఓ పరికరాన్ని ఆర్డ‌ర్ చేశామ‌ని చెప్పారు. దానికి సంబంధించిన పార్శిల్‌ రామానాయుడు స్టూడియో చిరునామాకు వచ్చిందని వివరణ ఇచ్చారు. ఆ పార్శిల్‌ను తనిఖీ చేయ‌డానికి కనకదుర్గ త‌మ స్టూడియోకు వచ్చారని తెలిపారు.

మ‌రోవైపు డ్రగ్స్‌ సమస్య విష‌యంలో తెలుగు సినిమా పరిశ్రమ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది. డ్రగ్స్‌ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సున్నితంగా పరిష్కరించాలని కోరింది. డ్రగ్స్‌ కేసు విచారణ జరిగిన 10 రోజులు ఇండస్ట్రీకి చీకటిరోజులుగా పేర్కొంది. డగ్స్‌ వాడిన వారిపై తామే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. డ్రగ్స్‌ వ్యవహారం తమందరికీ ఓ కుదుపు, ఓ హెచ్చరిక అని తెలుగు సినిమా పరిశ్రమ ప్ర‌తినిధులు ఈ లేఖ‌లో పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసు ప్రభావం వేలాది కుటుంబాలపై పడనుందని, సినిమా పరిశ్రమ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని హుందాగా దర్యాప్తు సాగించాలని కోరుకుంటున్నామని తెలిపారు.