Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: ఈడీ చేతికి ఎక్సైజ్ శాఖ రికార్డులు.. మరోసారి విచారణ తప్పదా?

By:  Tupaki Desk   |   29 March 2022 2:54 PM GMT
డ్రగ్స్ కేసు: ఈడీ చేతికి ఎక్సైజ్ శాఖ రికార్డులు.. మరోసారి విచారణ తప్పదా?
X
టాలీవుడ్‌ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది. నాలుగేళ్ళ క్రితం తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిట్ క్లీన్ చిట్ ఇచ్చన ఈ కేసులో.. ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వేగవంతం చేయబోతోంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు సెలబ్రిటీలను ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. డ్రగ్స్ కేసులో నిందితులు మరియు సాక్షుల వాంగ్మూలాలు - ఫోన్ కాల్ డేటా తదితర వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను కోరారు. ఈ క్రమంలో కేసు వివరాలు ఇవ్వడం లేదని హైకోర్ట్‌ కు ఈడీ వెళ్లడంతో.. ఈ కేసుకి సంబంధించి రికార్డులన్నీ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఎక్సైజ్ శాఖని ఆదేశించింది.

అయినా సరే ఎక్సైజ్ శాఖ దీనిపై స్పందించకపోవడంతో గతవారం ఈడీ అధికారులు కోర్టు ధిక్కార కేసు నమోదు చేశారు. డిజిటల్ రికార్డులు - కాల్ డేటా ఇవ్వడం లేదని పిటిషన్ లో వివరించారు. విచారణకు ఎక్సైజ్ శాఖ సహకరించడం లేదని హైకోర్టులో వాదించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ - ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై అసహనం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఈడీకి పూర్తి వివరాలను అందజేసింది. డిజిటల్ రికార్డులు - కాల్ డేటా మరియు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలను ఈడీ అధికారులకు అందించారు. డ్రగ్స్ కేసులో ఈడీ కోరిన పూర్తి వివరాలన్నీ అందజేశామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ హైకోర్టులో మెమో దాఖలు చేసింది. దీంతో కోర్టు ధిక్కార కేసును ఈడీ ఉపసంహరించుకుంది.

ఎక్సైజ్ శాఖ సమర్పించిన వివరాలను ఈడీ ధృవీకరించనుంది. రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, దీని ఆధారంగా, ఆర్థిక లావాదేవీలు - డ్రగ్స్ వినియోగం - క్రయ విక్రయాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖుల పాత్రపై మరోసారి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

2017లో తెలంగాణా ఆబ్కారీ పోలీసులు కెల్విన్ మార్కెరాన్స్ అనే డ్రగ్ సప్లయిర్ ని అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు సిట్ పలువురు సినీ ప్రముఖులను ఎంక్వైరీ చేసింది. వీరి నుంచి రక్త నమూనాలు - గోళ్లు - తల వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. కానీ డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో వారికి క్లీన్ చిట్ ఇచ్చారు.

అయితే డ్రగ్స్ క్రయ విక్రయాల్లో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) మరియు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. గతేడాది ఆగస్టు చివరి వారం నుంచి 12 మంది సెలబ్రిటీలను విచారించారు. నిందితుడు కెల్విన్ తో ఉన్న సంబంధాల గురించి.. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు.

రకుల్ ప్రీత్ సింగ్ - రానా దగ్గుబాటి - రవితేజ - ఛార్మీ కౌర్ - పూరీ జగన్నాధ్ - నవదీప్ - ముమైత్ ఖాన్ - తనీష్ - నందు - తరుణ్ వంటి ప్రముఖులు ఈడీ గతంలో ప్రశ్నించిన వారిలో ఉన్నారు. ఇప్పుడు మరోసారి విచారించే అవకాశం ఉందని వస్తున్న వార్తలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.