Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'దృశ్యం-2'

By:  Tupaki Desk   |   19 Feb 2021 7:21 AM GMT
మూవీ రివ్యూ: దృశ్యం-2
X
చిత్రం : 'దృశ్యం-2'

నటీనటులు: మోహన్ లాల్-మీనా-అన్సిబా-ఎస్తేర్ అనిల్-మురళి గోపి-ఆశా శరత్-సిద్దిఖ్ తదితరులు
సంగీతం: అనిల్ జాన్సన్
ఛాయాగ్రహణం: సతీష్ కురుప్
నిర్మాత: ఆంటోనీ పెరుంబవూర్
రచన-దర్శకత్వం: జీతు జోసెఫ్

దృశ్యం.. ఆరేళ్ల కిందట సంచలన విజయం సాధించిన మలయాళ సినిమా. ఈ చిత్రం తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో రీమేక్ అయి అన్ని చోట్లా మంచి విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రానికి మలయాళంలో సీక్వెల్ తెరకెక్కింది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో అదే కాస్ట్ అండ్ క్రూతో జీతు జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందించడంతో వివిధ భాషల ప్రేక్షకులను ఈ సినిమా ఆకర్షించింది. నేరుగా అమేజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం ఏమేర అంచనాలను అందుకుందో చూద్దాం పదండి.

కథ:

తన కుటుంబం చేతిలో హతమైన వరుణ్ మృతదేహాన్ని ఎవరూ ఊహించని విధంగా పోలీస్ స్టేషన్లోనే పాతిపెట్టి ఆ కేసు నుంచి తెలివిగా బయటపడ్డ జార్జి కుట్టి (మోహన్ లాల్).. ఆ తర్వాత కుటుంబంతో కలిసి సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటాడు. తన కేబుల్ టీవీ వ్యాపారాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లిన జార్జి.. తనకున్న సినిమా పిచ్చితో కొత్తగా థియేటర్ కూడా తెరుస్తాడు. ఐతే వరుణ్ హత్య కేసును ఛేదించలేక జార్జి కారణంగా అవమాన భారం ఎదుర్కొంటున్న పోలీసులు.. ఈ కేసును అంత తేలిగ్గా వదిలేయరు. జార్జికి తెలియకుండా రహస్యంగా విచారణ సాగిస్తూనే ఉంటారు. వారికి అనుకోకుండా ఈ కేసులో కొన్ని కీలక సాక్ష్యాలు లభిస్తాయి. ఆ సాక్ష్యాలేంటి.. వాటి వల్ల జార్జి కుటుంబం మళ్లీ ఎలా చిక్కుల్లో పడింది.. చివరికి ఏమైంది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ విజయవంతమైన దాఖలాలు చాలా తక్కువ. బాలీవుడ్లో కొన్ని సినిమాలేవో ఆడేశాయి కానీ.. దక్షిణాదిన అయితే సీక్వెల్స్ అస్సలు కలిసి రాలేదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు పెద్ద హిట్టయిన సినిమాను క్యాష్ చేసుకోవడానికే ఇక్కడ సీక్వెల్స్ తీస్తుంటారు. ఒరిజినల్ స్థాయిలో కొనసాగింపు చిత్రాల్ని‌ తీయడంలో తడబడుతుంటారు. ముఖ్యంగా అంచనాల ఒత్తిడిలో చాలామంది దర్శకులు చిత్తయిపోతుంటారు. ‘దృశ్యం’ సీక్వెల్ ను గత ఏడాది లాక్ డౌన్ అనంతరం హడావుడిగా మొదలుపెట్టి కేవలం నెలన్నరలో పూర్తి చేసి.. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయడం చూస్తే ఇదేదో పైన చెప్పినట్లు క్యాష్ చేసుకునే వ్యవహారం లాగే కనిపించింది. కానీ ‘దృశ్యం’ సినిమా చూశాక మాత్రం ఆ అభిప్రాయాలన్నీ మార్చుకోవడం ఖాయం. మామూలుగానే మొదలై.. ఒక దశ దాటాక ఎంతో ఆసక్తి రేకెత్తిస్తూ.. అనూహ్య మలుపులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తూ.. చివరికి ‘వావ్’ అనిపించేలా ముగుస్తుంది ‘దృశ్యం-2’. మలయాళం అనే కాదు.. ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెల్స్ గా ‘దృశ్యం-2’ నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

‘దృశ్యం-2’ ఒక నిఖార్సయిన సీక్వెల్. ‘దృశ్యం’ కథ ఎక్కడ ఆగిందో సరిగ్గా అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుంది. ‘దృశ్యం’ సినిమా వచ్చిన ఆరేళ్లు కాగా.. కథలో కూడా ఆరేళ్లు గడిచాక పరిస్థితులు ఎలా మారాయో.. జార్జి కుట్టి కుటుంబంంలో ఈ ఆరేళ్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో.. వరుణ్ హత్య కేసు విషయంలో పోలీసులు ఏం చేస్తున్నారో.. ఊళ్లో వాళ్లు ఈ కేసు గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో.. ఇవన్నీ కూడా నిజంగా ఇలాంటి కేసు ఒకటి చోటు చేసుకుంటే ఏం జరిగి ఉంటుందో చాలా సహజమైన రీతిలో ఆవిష్కరించాడు దర్శకుడు జీతు జోసెఫ్. ఐతే తొలి గంటలో వ్యవహారమంతా కూడా చాలా సాదాసీదాగానే అనిపిస్తుంది. కుటుంబ సన్నివేశాల్లో ఏమంత విశేషం కనిపించదు. వరుణ్ కేసు ఆ కుటుంబాన్ని ఎలా వెంటాడుతోందో చెప్పే సన్నివేశాలు కొంత ఆసక్తికరంగా అనిపిస్తాయి. అవి మినహాయిస్తే.. అంతా మామూలుగానే అనిపిస్తుంది. దీంతో ఈ కథను ఎలా ముందుకు తీసుకెళ్తారనే సందేహాలు కలుగుతాయి. ‘దృశ్యం’ ముందు సీక్వెల్ తేలిపోతుందేమో అన్న అభిప్రాయాలు కూడా కలుగుతాయి. కానీ జార్జి కుటుంబాన్ని పోలీసులు ఎలా టార్గెట్ చేశారు.. హత్య కేసును ఛేదించడం కోసం వాళ్లెలాంటి రహస్య ప్రణాళికను అమలు చేస్తున్నారనే ట్విస్ట్ రివీల్ చేశాక తొలిసారి ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలవుతుంది. ఇది ఆషామాషీ సినిమా ఏమీ కాదన్న ఆలోచన తొలిసారి అక్కడే కలుగుతుంది.

కేసును తిరగదోడి వరుణ్ మృతదేహం ఎక్కడుందో ఎలాగైనా తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు సాగించడం.. అదే సమయంలో జార్జి తన వైపు నుంచి ఎక్కడా తప్పు జరగకుండా పట్టుదల ప్రదర్శించడం.. ఈ క్రమంలో ఉత్కంఠ రేగుతుంది. పోలీసులు మృతదేహం ఎక్కడుందో కనుగొన్నాక ‘దృశ్యం-2’లో అసలు కథ మొదలవుతుంది. హీరో తానే హత్య చేసినట్లు అంగీకరించి శిక్ష అనుభవించడానికి సిద్ధపడిపోవడంతో ఇదేంటి సినిమాను ఇలా తేల్చేశారు అనిపిస్తుంది కానీ.. ఆ తర్వాత వచ్చే మలుపులతో ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ఇక్కడి నుంచి సినిమా స్థాయే మారిపోతుంది. ప్రేక్షకులు ఏమాత్రం ఊహించని ట్విస్టులు ఒకదాని తర్వాత ఒకటి విస్మయానికి గురి చేస్తాయి. హీరో తెలివికి సినిమాలోని పాత్రలు ఎలా షాకవుతాయో.. దర్శకుడి తెలివికి ప్రేక్షకులు కూడా అలాంటి భావనలోకే వెళ్తారు. జీతు జోసెఫ్ మామూలు రచయిత - దర్శకుడు కాదనే విషయం చివరి అరగంటలో తెలుస్తుంది. తొలి అర్ధభాగంలో అనాసక్తికరంగా అనిపించిన సన్నివేశాలు - పాత్రలకు కూడా జస్టిఫికేషన్ ఇస్తూ.. ఆ పాత్రలు - సన్నివేశాల పరమార్థం తెలియజేస్తూ చివర్లో వచ్చే ట్విస్టులు అదరహో అనిపిస్తాయి. చివరికి జార్జి కుట్టి అనే పాత్ర పట్ల ఒక ఆరాధన భావం కలిగేలా సినిమాను ముగిస్తాడు జీతు జోసెఫ్. ఒకసారి ఈ సీక్వెల్ ఎలా మొదలైందో ఆలోచిస్తే.. ముగించిన విధానానికి పొంతన కనిపించదు. సినిమా మొదలైనప్పటితో పోలిస్తే చివరికి ప్రేక్షకుల ఫీలింగే మారిపోతుంది. సీక్వెల్ అంటే ఇలా ఉండాలనిపించేలా ‘దృశ్యం-2’ ముగుస్తుంది. ఏ అంచనాలు లేకుండా ‘దృశ్యం’ చూసి ఫిదా అయిన ప్రేక్షకులు.. మంచి అంచనాలతో ‘దృశ్యం-2’ చూసినా కూడా వారిని అనుకున్నదాని కంటే ఎక్కువగానే థ్రిల్ చేయడంలో ‘దృశ్యం-2’ విజయవంతమైంది.

నటీనటులు:

మోహన్ లాల్ గురించి చెప్పేదేముంది? ఆయన్ని కంప్లీట్ యాక్టర్ అని ఎందుకంటారో ‘దృశ్యం-2’తో మరోసారి రుజువైంది. జార్జి కుట్టి అనే వ్యక్తి నిజంగానే ఉన్నట్లుగా ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. ఆ స్క్రీన్ ప్రెజెన్స్.. సటిల్ యాక్టింగ్.. కొలిచినట్లుగా ఇచ్చే హావభావాలు.. ఇంకెవరికీ సాధ్యం కాదనే భావన కలుగుతుంది సినిమా చూస్తున్నంతసేపూ. కేసు నుంచి బయటపడి గంభీరంగా కోర్టులో నడిచి వచ్చే చివరి సన్నివేశంలో మోహన్ లాల్ స్థాయి ఏంటో తెలుస్తుంది. మిగతా నటీనటుల్లో ఎక్కువ ఆక్టుకునేది ఐజీ పాత్ర చేసిన మురళి గోపి. అతను నిజంగా పోలీస్ ఉన్నతాధికారి అనిపించేలా అద్భుతంగా నటించాడు. జార్జి భార్య పాత్రలో మీనా కూడా చాలా బాగా చేసింది. కూతుళ్ల పాత్రల్లో అన్సిబా.. ఎస్తేర్ అనిల్ కూడా చక్కగా నటించారు. ఆశా శరత్.. సిద్దిఖ్ కూడా పాత్రలకు తగ్గట్లు నటించారు. మిగతా నటీనటులందరూ ఓకే.

సాంకేతిక వర్గం:

దృశ్యం-2 సాంకేతికంగా కూడా ఉన్నతంగా అనిపిస్తుంది. రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో ఉన్నది ఒకటే పాట. అది జస్ట్ ఓకే అనిపిస్తుంది కానీ.. నేపథ్య సంగీతంలో అనిల్ జాన్సన్ తన ముద్రను చాటాడు. ద్వితీయార్ధంలో కథలో మలుపులకు తగ్గట్లే ఉత్కంఠ రేపే బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు అతను బలమయ్యాడు. సతీష్ కురూప్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమాకు అవసరమైన మేర ఖర్చు పెట్టారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ జీతు జోసెఫ్ పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్రిల్లర్లు తీయడంలో ఆయన ప్రతిభ అబ్బురపరుస్తుంది. ‘దృశ్యం’ లాంటి చిత్రానికి సీక్వెల్ తీయాలనుకోవడమే పెద్ద సాహసం. అంచనాలను అందుకోవడం అంత తేలిక కాదు. కానీ ఏదో మొక్కుబడిగా సీక్వెల్ తీసేయకుండా ఎంతో కసరత్తు చేసి అతనీ స్క్రిప్టును తీర్చిదిద్దాడని తెలుస్తుంది. స్క్రీన్ ప్లే ‘దృశ్యం-2’లో అది పెద్ద హైలైట్. ముఖ్యంగా ద్వితీయార్ధాన్ని తీర్చిదిద్దిన విషయంలో జీతును ఎంత పొగిడినా తక్కువే. ‘దృశ్యం’ గాలి వాటంగా తీసిన సినిమా కాదని అతను ‘దృశ్యం-2’తో చాటిచెప్పాడు.

చివరగా: దృశ్యం-2.. డబుల్ థ్రిల్!!

రేటింగ్-3.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre