Begin typing your search above and press return to search.

జెట్ స్పీడ్ తో 'దృశ్యం 2' షూటింగ్ పూర్తి చేసిన వెంకీ..!

By:  Tupaki Desk   |   15 April 2021 7:30 AM GMT
జెట్ స్పీడ్ తో దృశ్యం 2 షూటింగ్ పూర్తి చేసిన వెంకీ..!
X
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'దృశ్యం 2' సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. 'దృశ్యం' సినిమాతో సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ఈ సీక్వెల్ తెరకెక్కుతోంది. ఆయన భార్యగా సీనియర్ నటి మీనా నటిస్తోంది. మలయాళ వర్షన్ ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్‌ తెలుగు 'దృశ్యం 2' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పై డి. సురేష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లారు.

మార్చి మొదటి వారంలో ప్రారంభమైన 'దృశ్యం 2' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు నెల రోజుల్లోనే హీరో వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశాడు. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించిన చిత్ర బృందం ఓ ఫోటోని షేర్ చేసింది. 'దృశ్యం' ఫ్యామిలీ చిత్రీకరణ ముగించుకొని ఓ చెట్టు కింద సేదతీరుతున్నట్లు కనిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుందని.. త్వరలోనే పూర్తవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. కోవిడ్ పరిస్థితుల్లో పక్కా ప్రణాళికతో సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ సినిమా షూట్ పూర్తి చేయడం గొప్ప విషయమనే చెప్పాలి.

కాగా, 'దృశ్యం 2' చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలోనే విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. ఆగస్ట్ నెలలో వెంకటేష్ నటిస్తున్న 'ఎఫ్ 3' మూవీ విడుదల ఉంది కాబట్టి, జూన్ లేదా జూలైలో 'దృశ్యం 2' ని విడుద‌ల చేయాలని వెంకీ అండ్ టీమ్ ఆలోచన చేస్తోందట. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే 'నారప్ప' ను రిలీజ్ కి రెడీ చేసిన వెంకీ.. ఇకపై పూర్తి సమయం 'ఎఫ్ 3' షూటింగ్ కి కేటాయించనున్నాడు. ఏదేమైనా వెంకటేష్ ఈ ఏడాది మూడు సినిమాలతో రాబోతున్నాడని చెప్పవచ్చు.