Begin typing your search above and press return to search.

హీరోయిన్ ఒంటిపై పుట్టుమచ్చలు చూశారా? అని అడగడం దురదృష్టకరం..!

By:  Tupaki Desk   |   2 Feb 2022 5:01 PM GMT
హీరోయిన్ ఒంటిపై పుట్టుమచ్చలు చూశారా? అని అడగడం దురదృష్టకరం..!
X
ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోయే క్రేజీ చిత్రాల్లో ''డీజే టిల్లు'' కూడా ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ - నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర ప్రధాన తారాగణం సిబ్బంది హాజరై మీడియాతో ముచ్చటించారు. విలేఖరులు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా

హీరోని ఓ ప్రముఖ జర్నలిస్టు అడిగిన వల్గర్ ప్రశ్నపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ''డీజే టిల్లు'' ట్రైలర్ లో 'నీ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి?' అని హీరో అడగగా.. దానికి హీరోయిన్ 'పదహారు' అని సమాధానం చెప్తుంది. మీడియా ఇంటరాక్షన్ సమయంలో ఈ డైలాగ్ ని గుర్తుచేసిన ఓ విలేఖరి.. ''హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పించారు కదా.. హీరోయిన్ కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో రియల్ గా తెలుసుకున్నారా?'' అని హీరో సిద్ధు జొన్నలగడ్డని ప్రశ్నిస్తూ ఓ నవ్వు నవ్వాడు. దీనికి కంగుతిన్న సిద్దు ఈ ప్రశ్నకు తాను దూరంగా ఉండాలని అనుకుంటున్నానని స్పాంటేనియస్ గా సమాధానం చెప్పాడు.

ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే హీరోని సదరు జర్నలిస్ట్ ప్రశ్నించిన వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన అడిగిన ప్రశ్నకు హీరోయిన్ నేహాశెట్టి కూడా బాధ పడింది. దీనిపై నేహాశెట్టి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ''ఈరోజు ట్రైలర్ లాంచ్ లో ఇలాంటి ప్రశ్న వినాల్సి రావడం చాలా దురదృష్టకరం. కానీ అది తన వర్క్ ప్లేస్ లో.. ఇంట్లో తన చుట్టూ ఉన్న స్త్రీల పట్ల తనకున్న గౌరవాన్ని సులభతరం చేస్తుందని నేను చెప్పాలి'' అని పేర్కొంది.

నేహా ట్వీట్ కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి మద్దతు లభిస్తోంది. జర్నలిజం అంటే ఇదేనా అంటూ మరికొందరు సదరు విలేఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. 'డీజే టిల్లు' నిర్మాత నాగవంశీ కూడా నేహా ట్వీట్ పై స్పందిస్తూ “సారీ నేహా.. అది నిజంగా దురదృష్టకరం” అని పేర్కొన్నారు.