Begin typing your search above and press return to search.

మహేష్ - ప్రశాంత్ మధ్య ఆ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ జరిగిందా..?

By:  Tupaki Desk   |   18 Dec 2020 5:30 PM GMT
మహేష్ - ప్రశాంత్ మధ్య ఆ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ జరిగిందా..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్‌' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. మహేష్ తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశారు. దీని గురించి డిస్కషన్స్ కూడా జరిగినట్లు చెప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇదే సమయంలో మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. అలానే ప్రశాంత్ నీల్ కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'సలార్' అనే పాన్ ఇండియా మూవీకి కమిట్ అయ్యాడు. దీంతో ఇప్పట్లో మహేష్ - ప్రశాంత్ కాంబోలో సినిమా ఉండకపోవచ్చని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే నిన్న అనుకోకుండా వీరిద్దరూ ఒకే పార్టీలో కలుసుకోవడంతో మరోసారి ఆ ప్రాజెక్ట్ గురించి చర్చ జరిగి ఉండొచ్చని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు.

టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్‌ రాజు 50వ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులకు గ్రాండ్‌ గా పార్టీ ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీస్‌ తో పాటు తనకు పరిచయం ఉన్న ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను ఈ వేడుకకు ఆహ్వానించాడు. అందులో మహేష్ బాబు - ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య కొన్ని నెలల ముందు చర్చలు జరిపిన సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకునే ఉంటారని సినీ అభిమానులు అనుకుంటున్నారు. మహేష్ పాన్ ఇండియా సినిమా చేస్తే చూడాలని ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ సైతం కుదిరితే ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తే అయితే బాగుంటుందని భావిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో మహేష్ బాబు ఎలాగూ ఓ పాన్ ఇండియా సినిమా చేయాల్సి ఉంది. ఇదే క్రమంలో ప్రశాంత్ వంటి మాస్ డైరెక్టర్ తో సినిమా ఉంటే మహేష్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా నిలిచిపోతాడని అభిమానులు అనుకుంటున్నారు. మరి త్వరలోనే వారి ఆశలు నెరవేరుతాయేమో చూడాలి.