Begin typing your search above and press return to search.

డిజాస్టర్ డైరెక్టర్ ఈజ్ బ్యాక్!

By:  Tupaki Desk   |   10 Jun 2022 12:30 AM GMT
డిజాస్టర్ డైరెక్టర్ ఈజ్ బ్యాక్!
X
ఎ.ఎం.రత్నం.. ఒకప్పుడు అటు తమిళంలో, ఇటు తెలుగులో భారీ చిత్రాలు నిర్మించిన ప్రొడ్యూసర్. కర్తవ్యం, పెద్దరికం, స్నేహం కోసం, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, 7/జి బృందావన కాలనీ, ఖుషి, నాగ, బంగారం.. ఇలా శ్రీ సూర్యా మూవీస్ బేనర్లో ఎన్నో భారీ చిత్రాలను నిర్మించి సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఆయన పేరు సంపాదించారు.

రత్నం నిర్మాణంలో సినిమా అంటే భారీతనానికి కేరాప్ అడ్రస్‌గా ఉండేది. ఆయన సక్సెస్ రేట్ కూడా ఎవ్వరూ అందుకోలేని రేంజిలో ఉండేది. కానీ 'ఖుషి' తర్వాత ఆయన.. తన స్థాయికి తగ్గ సినిమాలు తీయలేకపోయారు.

నాగ, బంగారం లాంటి పెద్ద సినిమాలకు తోడు.. కొడుకులు రవికృష్ణ, జ్యోతికృష్ణలతో చేసిన సినిమాలు ఆయన కొంప ముంచాయి. ముఖ్యంగా పెద్ద కొడుకు జ్యోతికృష్ణ ఆయనకు చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. తండ్రిలా నిర్మాతా అవ్వకుండా.. తమ్ముడిలా హీరోగానూ మారకుండా.. జ్యోతికృష్ణ దర్శకత్వ బాట పట్టాడు.

ముందుగా అతను తరుణ్, త్రిష ప్రధాన పాత్రల్లో పెద్ద బడ్జెట్లో 'నీ మనసు నాకు తెలుసు'తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అది పెద్ద ఫ్లాప్ అయింది. అయినా ఆగలేదు. తర్వాత తమ్ముడిని హీరోగా పెట్టి 'కేడి' తీశాడు. అదీ తుస్సుమనిపించింది. ఆపై గోపీచంద్ హీరోగా 'ఆక్సిజన్' తీస్తే అదీ డిజాస్టరే. వేరే సినిమాలు కూడా దెబ్బ కొట్టినప్పటికీ కొడుకు సినిమాలే రత్నంను ఎక్కువగా ముంచాయి. దీంతో కొన్నేళ్ల పాటు సినిమాల నిర్మాణమే మానేశాడు.

జ్యోతికృష్ణ కూడా చాలా ఏళ్లుగా సినిమాల జోలికి వెళ్లట్లేదు. కానీ ఇప్పుడు అతను మళ్లీ మెగా ఫోన్ పడుతున్నాడట. తెలుగులోకి అతను రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 'రాజా వారు రాణి వారు', 'ఎస్ఆర్ కళ్యాణమండపం' చిత్రాలతో పేరు తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడట జ్యోతికృష్ణ. ఇందులో 'డీజే టిల్లు'భామ నేహా శెట్టి కథానాయికగా నటించబోతోందట.

మరి ఈ చిత్రాన్ని రత్నంయే నిర్మించబోతున్నాడా.. వేరే నిర్మాత ఎవరైనా రిస్క్ చేయబోతున్నారా అన్నది తెలియదు. మరి తీసిన మూడు సినిమాలతోనూ దారుణమైన నష్టాలు మిగిల్చిన జ్యోతికృష్ణ.. ఈ సినిమాతో అయినా సక్సెస్ రుచి చూస్తాడా.. దర్శకుడిగా తనదైన ముద్ర వేస్తాడా అన్నది చూడాలి.