Begin typing your search above and press return to search.

ఎడ్వాన్సులు వెనక్కి ఇస్తున్న డైరెక్టర్?

By:  Tupaki Desk   |   25 Dec 2019 7:28 AM GMT
ఎడ్వాన్సులు వెనక్కి ఇస్తున్న డైరెక్టర్?
X
ఎక్కడైనా సక్సెస్ కే విలువ ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీ కూడా అందుకు అతీతమేమీ కాదు. అందుకే హిట్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ కు పెద్ద నిర్మాతలు ఎడాపెడా ఎడ్వాన్సులు ఇస్తారు. భవిష్యత్తులో తమ బ్యానర్ లో సదరు డైరెక్టర్ పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే అన్నిసార్లు ఆ సినిమాలు తెరకెక్కవు. అలాంటి సమయంలో నిర్మాతలకు ఆ ఎడ్వాన్సును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరశురామ్ పరిస్థితి అలానే ఉందట.

'గీతగోవిందం' సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు పరశురామ్. 'గీతగోవిందం' తర్వాత చాలామంది పరశురామ్ తో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపించారు. పరశురామ్ కు గతంలో ఎడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు తమ బ్యానర్లో సినిమా చేయాల్సిందిగా ఒత్తిడి చేశారట. అయితే స్టార్ హీరోతోనే సినిమా చేయాలని పట్టుబట్టి కూర్చున్న పరశురామ్ కు అలాంటి ప్రాజెక్టు ఏదీ సెట్ కాలేదు. ఈమధ్య 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో నాగచైతన్యతో సినిమా ఫిక్స్ అయింది. దీంతో పరశురామ్ ఇతర నిర్మాతల దగ్గర తీసుకున్న ఎడ్వాన్సులను వడ్డీతో సహా తిరిగి ఇచ్చే పనిలో పడ్డాడట.

ఈ లిస్టులో మోహన్ బాబు.. బీవీఎస్ ఎన్ ప్రసాద్.. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఉన్నారట. అయితే పరశురామ్ ఇలా ఎడ్వాన్సుల తిరిగి ఇవ్వడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. 'గీతగోవిందం' తర్వాత పరశురామ్ కు దాదాపు ఎడాదిన్నర గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో రెండు సినిమాలు పూర్తి చేసే అవకాశం ఉందని.. ఇలాంటి విషయాల్లో పూరి జగన్నాధ్.. అనిల్ రావిపూడి లాంటి స్పీడ్ డైరెక్టర్లను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.